సొంత వైద్యంతో ప్రాణాలకు ముప్పు.. కోవిడ్‌పై వైద్యుల తాజా హెచ్చరిక

|

Sep 15, 2020 | 11:02 AM

కరోనా వైరస్ వ్యాప్తి మొదలై సుమారు ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో వైద్య నిఫుణుల సలహాలు, సూచనలు అత్యంత కీలకంగా మారాయి. ఎవరికి తోచి విధంగా వారు సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటూ అమాయకులను తప్పు దారి పట్టిస్తున్న నేపథ్యంలో...

సొంత వైద్యంతో ప్రాణాలకు ముప్పు.. కోవిడ్‌పై  వైద్యుల తాజా హెచ్చరిక
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తి మొదలై సుమారు ఆరు నెలలు కావస్తున్న నేపథ్యంలో వైద్య నిఫుణుల సలహాలు, సూచనలు అత్యంత కీలకంగా మారాయి. ఎవరికి తోచి విధంగా వారు సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటూ అమాయకులను తప్పు దారి పట్టిస్తున్న నేపథ్యంలో వైద్య నిఫుణులు ముఖ్యమైన సూచనలతో ప్రజలను ఎడ్యుకేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

” కోవిడ్-19 వైరస్ తీవ్రత మెజార్టీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైనది ఏం కాదు. అయితే ఆ వైరస్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు “ అని అంటున్నారు డాక్టర్ అర్జా శ్రీకాంత్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ శ్రీకాంత్ .. తాజాగా రాష్ట్ర యువతకు ముఖ్యంగా నలభై ఏళ్లకు అటు ఇటుగా ఉన్న వ్యక్తుల నిర్లక్ష్యానికి సంబంధించి కీలకమైన సూచనలు చేశారు. ఈ మేరకు డాక్టర్ శ్రీకాంత్ వివిధ వైద్య నిపుణుల అభిప్రాయాలు, సూచనలను క్రోడీకరిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి అంశాల్లో అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో ఆస్పత్రులకు వెళ్ళే విషయాల్లో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని డాక్టర్ శ్రీకాంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత యువత బయట తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ముగ్గురేసి ప్రయాణించడం కూడా కోవిడ్ వైరస్ విస్తృతికి కారణమవుతోందని నిపుణులు అంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 40 ఏళ్లలోపు వారు 55శాతం మంది ఉన్నారని.. యువత మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే ఫలానా మందులు వాడండి, ఫలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి సమస్యను కొని తెచ్చుకుంటున్నారని, కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యంతో ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

కోవిడ్ పరీక్షలకు వెళ్లని యువత

” ఇటీవల కాలంలో యువత ఉపాధి, ఉద్యోగాల కోసం బయటతిరుగుతున్నారు. ఈ క్రమంలోనే యువత వైరస్‌ బారిన పడుతున్నారు. అదే సమయంలో మరికొందరు యువకులు బయట తిరిగే సమయంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువతలో ఎక్కువ మందికి వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా నిర్ధారణ పరీక్షలకు వెళ్ళడం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాల వ్యాధులున్న కుటుంబంలోని పెద్దలకు వైరస్‌ త్వరగా వ్యాపిస్తున్నది “ అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జ్వరం వస్తే అశ్రద్ధ వద్దు

” ఓవైపు కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంటే.. మరోవైపు సీజన్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం సాధారణమే అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. రోజుల తరబడి జ్వరంతో బాధపడుతున్న వారు ఊపిరాడని స్థితిలో మాత్రమే ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆసమయంలో వైరస్ శాతం అధికంగా ఉండటం, ఊపిరితిత్తులు చాలా వరకు దెబ్బతినటం వల్ల వారిని కాపాడటం చాలా కష్టమవుతోంది “ వైద్యులు చెబుతున్నారు.

సొంతంగా చికిత్స వద్దు

” ప్రస్తుతం చాలా మంది కోవిడ్ కు సంబంధించిన వైద్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేసి కొన్ని రోజులపాటు ఇంటి వద్దే కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు ముందు నిర్ణయం కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి “ అని వైద్యులు సూచిస్తున్నారు.

ధైర్యంగా ఉందాం-కోవిడ్ ను ఎదుర్కొందాం

కోవిడ్ బారినపడిన వారిలో అధికశాతం మంది మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం వంటి లక్షణాల కారణంగా చనిపోతున్నారు. కోవిడ్ నన్నేమీ చేయలేదు అనే గుండెనిబ్బరం ఉన్నవారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లినా తిరిగి కోలుకుంటున్నారు. అందుకే మానసికంగా దృడంగా ఉన్నవారు కోవిడ్ బారినుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆవిరి పట్టుకోవడం- పుక్కిలించడం ముఖ్యం

కోవిడ్ బాధితులు పసుపు, జండూబామ్, జిందాతిలిస్మాత్ లేదా బ్రీత్ ఈజీ మాత్రలు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టటం వలన ఊపిరితిత్తుల సమస్య చాలా వరకు తగ్గి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతున్నారని వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. చాలా మంది వైద్యులు కూడా ఆవిరి పట్టుకోవడాన్ని చికిత్సలో భాగంగానే చూడాలని చెప్తున్నారు. అదే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ అలాగే వేడి నీటిలో ఉప్పు వేసి గానీ, బెటాడిన్ గార్గిల్ ద్రావణాన్ని ఒక మూతకు 2 మూతల వేడి నీటితో కలుపుకుని ఉదయం, సాయంత్రం పుక్కిలిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువంటున్నారు. వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు.

వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది

” కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న ఈపరిస్థితుల్లో ప్రజలంతా వీలైనన్ని సార్లు వేడినీరు, గ్రీన్ టీ, అల్లంటీ తీసుకోవడం, ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహార, పానీయాలను తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదు” అని సూచిస్తున్నారు.

వైద్యం, కౌన్సిలింగ్ చాలా అవసరం

” చాలా మంది వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికగా వస్తున్న సమాచారం ఆధారంగా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా గురించి అనుమానాలున్నా, కోవిడ్ సోకినా తప్పనిసరిగా నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ తీసుకోవాలి “ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ 19 నోడల్ అధికారి డాక్టర్ శ్రీకాంత్ సూచించారు.