Botsa Satyanarayana suggestion to Chandrababu: ఏపీలో ఓవైపు కరోనా పాండామిక్ సిచ్యువేషన్ కొనసాగుతుంటే మరోవైపు పొలిటికల్ వార్ కూడా అదే స్థాయిలో కొనసాగుతోంది. దేశంలో మరే ఇతర రాష్ట్రంలోను కరోనా కల్లోల పరిస్థితిలో రాజకీయ వాదులాటలు కొనసాగకపోయినా అందుకు భిన్నంగా ఏపీలో రాజకీయ వాదులాటలు కొనసాగుతూనే వున్నాయి.
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేస్తున్నట్లు కనిపిస్తూనే విపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నట్లుగా కనిపిస్తూనే చంద్రబాబుపై ఎదురు దాడికి దిగుతున్నారు ఏపీ మంత్రులు. వీరిలో బొత్స, బుగ్గన, పేర్ని, ఆళ్ళ వంటి మంత్రులు కనిపిస్తున్నారు పతాక శీర్షికల్లో.
తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రభుత్వ చర్యలను వెల్లడిస్తూనే చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అదే సమయంలో బాబుకు కొన్ని సూచనలు కూడా చేశారు. అన్ని జిల్లాల్లో కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు బొత్స. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేకుండా అందరూ సహకరించాలని పరోక్షంగా చంద్రబాబుకు హితవు పలికారు. రానున్న వారం రోజులు అత్యంత కీలకమైన రోజులని, పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లకి లోటు లేదని బొత్స వివరించారు.
ప్రభుత్వం కరోనా అంశాన్ని ఒక బాధ్యత గా తీసుకుందంటున్నారు బొత్స. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ప్రజాప్రతినిధి, ప్రతి కార్యకర్త బాధ్యతగా నిర్వర్తిస్తారని, కొందరు మాత్రం రాజకీయాలు చేస్తుంటారని బొత్స సెటైర్లు వేశారు. విపత్కర పరిస్థితిలో రాజకీయాలకు దూరంగా వ్యవహరించాలని ఆయన చంద్రబాబుకు హితవు పలికారు.