AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్యాపింగ్‌ కలకలం.. పొలిటికల్‌ నినాదం

ఏపీలో మరోసారి టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తూ.. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అసవరం ఉందని ప్రధానికి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అవసరం తమకు లేదంటోంది వైసీసీ. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసిన వారికి నోటీసులు..

ట్యాపింగ్‌ కలకలం.. పొలిటికల్‌ నినాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2020 | 8:53 PM

Share

ఏపీలో మరోసారి టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తూ.. టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారని.. దీనిపై జోక్యం చేసుకోవాల్సిన అసవరం ఉందని ప్రధానికి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అవసరం తమకు లేదంటోంది వైసీసీ. అదే సమయంలో నిరాధార ఆరోపణలు చేసిన వారికి నోటీసులు ఇచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో టీడీపీ అధికారంలోకి ఉండగా.. వైసీపీ కూడా టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టులో కేసులు వేసింది. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 5(2)ప్రకారం టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చేయడానికి మార్గదర్శకాలున్నాయి. అయినా ఏదో రాష్ట్రంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వివాదం వినిపిస్తూనే ఉంది. రాజకీయంగా దుమారం రేపుతూనే ఉన్నాయి.

ఏపీలో లెక్క తేలుతుందా?

నిత్యం ఏదో ఒక అంశం తెరమీదకు వచ్చి అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతున్న ఏపీలో తాజాగా టెలిఫోన్‌ ట్యాపింగ్‌ చిచ్చు రేగింది. ఇటీవల న్యాయమూర్తుల టెలిఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్న ప్రచారం జరిగింది. దీనిపై కొందరు కోర్టుకు ఆశ్రయించారు. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి ఇదని.. దీనిని వెంటనే విచారణకు స్వీకరించాలని లాయర్‌ శ్రవణ్‌కుమార్‌ హైకోర్టును కోరారు. దీంతో పిటిషన్ స్వీకరించిన కోర్టు మంగళవారం విచారణ చేపడతామంది. ఈ వివాదం ఇలా ఉండగా.. తన రెండు ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయని చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లేఖ రాశారు ఎంపీ రఘురామకృష్ణం రాజు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్‌ 21 కు విరుద్దగా ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంపై అటు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఏపీలో ప్రతిపక్షాలు, న్యాయమూర్తులు, కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయన్నారు చంద్రబాబు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని.. టెలిఫోన్‌ ట్యాపింగ్‌పై విచారణకు ఆదేశించాలన్నారు. ఎవరి ఫోన్లు ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం తమకు లేదని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు అంబటి రాంబాబు. అటు ప్రభుత్వం కూడా ఎదురుదాడి చేసింది. గతంలో ఇజ్రాయిల్‌ నుంచి పరికరాలు తీసుకొచ్చి తమ నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్టు ఆధారాలతో నిరూపించామన్నారు. దమ్ముంటే ఇప్పుడు కూడా టీడీపీ నిరూపించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు మంత్రి సుచరిత.

టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వివాదాలు కొత్తకాదు.. గతంలోనూ చంద్రబాబు ప్రభుత్వంపై వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు విదేశాల నుంచి ట్యాపింగ్‌ ఎక్విప్‌మెంట్‌ తీసుకొచ్చి మరీ ట్యాపింగ్‌కు పాల్పడినట్టు ఆరోపించింది. కేసులు కూడా దాఖలు చేసింది. ఇటీవల కర్నాటక, మహారాష్ట్ర, రాజస్తాన్‌లోనూ టెలిఫోన్‌ ట్యాపింగ్‌లపై రాజకీయ విమర్శలు.. ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. అంతకుమందు 1988లో టెలిఫోన్‌ట్యాపింగ్‌ విమర్శలతో కర్నాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెడ్గే కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.

యాక్ట్‌ ఏం చెబుతుంది.. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885 సెక్షన్ 5(2) జాతీయ భద్రతకు ముప్పు ఉన్న సందర్భంలో లేదా సార్వభౌమాధికారం, దేశ సమగ్రత ప్రయోజనాల కోసం విదేశాలతో స్నేహ పూర్వక సంబంధాలకు ముప్పు వాటిల్లే సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చని చెబుతుంది యాక్ట్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 సెక్షన్ 69 ప్రకారం ఇటీవల దాదాపు 10 సంస్థలకు ట్యాపింగ్‌ అధికారం IB, CBI, ED, DRI, CBDT, NIA, RAW డైరెక్టరేట్ ఆఫ్‌ సిగ్నల్‌ ఇంటెలిజెన్స్‌, ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాల్సి వస్తే హోంశాఖ అనుమతి ఉండాలి.

కేంద్ర సంస్థలు అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి పోలీసులు ఆ రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ అనుమతి తీసుకోవాలి. కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలో పర్యవేక్షించాలి. ఒకఫోన్‌ 180 రోజుల కంటే ఎక్కువ ట్యాప్‌ చేయకూడదు. అలాగే ప్రతి 60రోజులకు మళ్లీ మళ్లీ అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా అత్యవసర పరిస్థితుల్లో 72గంటలు ట్యాప్‌ చేయొచ్చు. అదే సమయంలో అనుమతి రాకుంటే రికార్డులు 48గంటల్లో ధ్వంసం చేయాలి.

Follow Us