డిల్లీ: ఆర్థిక నేరస్థుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ లండన్లో ఉన్నాడన్న విషయం తెలుసని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అతణ్ని భారత్కు అప్పగించే విషయంపై బ్రిటన్ ప్రభుత్వాన్ని ఇప్పటికే అభ్యర్థించామన్నారు. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ దిల్లీలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాల్ని వెల్లడించారు. ‘‘ నీరవ్ మోదీని భారత్కు రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాం. అతను బ్రిటన్లో ఉన్నాడన్న విషయం తెలుసు. నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలన్న అభ్యర్థన అక్కడి ప్రభుత్వ పరిశీలనలో ఉంది’’ అని రవీశ్ కుమార్ తెలిపారు. నీరవ్ మోదీని అప్పగించాలని గత ఆగస్టులోనే బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ చేసిన ఫిర్యాదులను అక్కడి ప్రభుత్వానికి విన్నవించామని.. ఇంకా ఎటువంటి సమాధానం రాలేదని వివరించారు.