
లాక్డౌన్ కారణంగా హైదరాబాద్లో చిక్కుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులను అమరావతి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్.
ఆంధ్రప్రదేశ్ లో తమ విధులకు హాజరుకాలేకపోతున్నసచివాలయ ఉద్యోగులకు ఊరట లభించింది. వారంతా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సీఎస్ నీలం సాహ్ని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్కు లేఖ రాశారు. హైదరాబాద్లో చిక్కుకుని విధులకు తమ ఉద్యోగులకు విధులకు రాలేకపోతున్నారని, ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం వేసే బస్సులకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. 400 మందికి ప్రత్యేక అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎస్ లేఖలో కోరారు. ఈ మేరకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్లోని మియాపూర్, కేపీహెచ్బీ, ఎల్బీనగర్ నుంచి 10 ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు అమరావతి వెళ్లనున్నారు. ఈ బస్సుల్లో ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే అనుమతినిస్తారు.