Chief Minister YS Jaganmohan Reddy : ఉచిత విద్యుత్ పథకం నగదు బదిలీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతుకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. కనెక్షన్లన్నీ రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా ఇస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం కూడా పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30–35ఏళ్లపాటు ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నట్లుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కేబినేట్ గురువారం సమావేశమైంది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఉచిత విద్యుత్ పథకం- నగదు బదిలీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
మీడియాకు పలు విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెల్లడించారు. ‘‘కనెక్షన్ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు ఖాతా ఉంటుంది. కరెంటు బిల్లు డబ్బు అందులో నేరుగా జమ కానుంది. అదే డబ్బును రైతులు డిస్కంలకు చెల్లించనున్నారు. దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదు’’ అని స్పష్టం చేశారు.