ప్రీ ప్రైమరీ విద్యపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్..
ప్రీ ప్రైమరీ విద్యపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా వీటిని నిర్వహించాలని సూచించారు...

ప్రీ ప్రైమరీ విద్యపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. అంగన్వాడీ కేంద్రాలకు అనుబంధంగా వీటిని నిర్వహించాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాల్లోనూ నాడు – నేడును చేపట్టాలని స్పష్టం చేశారు. 4 వేల కోట్ల రూపాయలతో అంగన్వాడీల్లో నాడు–నేడు కింద అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది.
ఇకపై వైఎస్సార్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా అంగన్ వాడీ కేంద్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రీ ప్రైమరీ పాఠశాలలపై సమీక్ష నిర్వహించారు.
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… అంగన్వాడీల్లో పాఠ్య ప్రణాళిక-ఒకటో తరగతి పాఠ్య ప్రణాళికతో ట్రాన్సిషన్ ఉండాలని అన్నారు. ప్రీ ప్రైమరీకి ప్రత్యేక పాఠ్య ప్రణాళిక, విద్యాశాఖకు తయారీ బాధ్యతను అప్పగించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ టీచర్లకు డిప్లమో కోర్సు ఉంటుందన్నారు. బోధనా పద్దతులు, పాఠ్య ప్రణాళిక, సులభమైన మార్గాల్లో పిల్లలకు విద్యా బోధనపై వారికి ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు.
నాడు– నేడు కింద అంగన్వాడీల అభివృద్ధి, కొత్త వాటి నిర్మాణం జరుగుతుందని… అంగన్వాడీ కేంద్రాలలో పరిశుభ్రమైన తాగునీరు, బాత్రూమ్స్ ఏర్పాటు చేయాలని అన్నారు. నాడు-నేడు కింద స్కూళ్లకు ఇప్పుడు ఇస్తున్న సదుపాయాలన్నీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం అమ్మ ఒడి ద్వారా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చామని అన్నారు.




