
ఏలూరులో ప్రబలిన వింత వ్యాధి ఒకరిని బలి తీసుకుంది. అక్కడ వారం రోజులుగా బాధితులు ఆస్పత్రులకు చేరుతుంటే.. ప్రాణాలపైకి వచ్చాక అధికారులు స్పందించారు. ఇంతలో జరగరాని నష్టం జరిగిపోయింది. ఏలూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీధర్ అనే వ్యక్తి చనిపోయాడు.
పశ్చిమగోదావరి జిల్లాలో అంతుచిక్కని వ్యాధి అందర్ని అయోమయానికి గురి చేస్తోంది. ఏవిధంగా సంక్రమిస్తోందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఏలూరు మొత్తానికి మంచినీరు వచ్చేది పంపుల చెరువు నుంచే. ఇక్కడ ఉన్న రెండు చెరువుల నుంచి నీటిని శుద్ధి చేసి వివిధ ప్రాంతాలకు అందిస్తున్నారు.
అయితే ఇపుడు ఇదే నీరు ఏలూరు వాసులను టెన్షన్కి గురి చేస్తోంది. నీరు తాగుతున్నామా లేక గరళం తాగుతున్నామా అనే భయం పట్టుకుంది. పుణె నుంచి వైరాలజీ నిపుణులు ఏలూరు చేరుకుని పరీక్షలు నిర్వహించబోతున్నారు. మరోవైపు వ్యాధి పేరు కూడా తెలీని జబ్బు నుంచి ఎప్పుడు విముక్తి పొందుతామా అని ఏలూరు వాసులు ఎదురు చూస్తున్నారు.
వ్యాధి పేరు తెలియదు. అందరిలో ఒకే లక్షణాలు. బాధితుల సంఖ్య వందల్లోకి చేరడంతో అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్లు, వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అసలు ఎన్ని అంబులెన్స్లను ఈసేవలకు ఉపయోగిస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేదు. ఎవరు అనారోగ్యంతో అయోమయానికి గురైన వెంటనే ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లకు కాల్ చేస్తున్నారు.
ఏలూరులో కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతల పర్యటనలు, అధికారుల సమీక్షలు నిర్వరామంగా జరుగుతున్నాయి. అయితే పరీక్షల ఫలితాలు తేలాలంటే ఇంకా టైమ్ పట్టే అవకాశముంది. వైద్యశాఖకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు సైతం రంగంలోకి దిగుతున్నాయి.