
కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవం మరోసారి రక్తసిక్తంగా మారింది. స్వామి అమ్మవార్ల విగ్రహాల కోసం 11 గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకున్నారు. ఈ సమరంలో 64 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారికి ఆదోని, ఆలూరు, కర్నూలు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. దేవరగట్టు కొండలో వెలసిన మాలమల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్భంగా కర్రల యుద్ధానికి దిగడం అక్కడి ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. దీనిని బన్నీ ఉత్సవంగా పిలుస్తారు. దీనిలో భాగంగా ఏటా దసరా పర్వదిననం రోజు దేవరగట్టు పరిధిలోని 11 గ్రామాలు ప్రజలు ఉత్సవ విగ్రహాల కోసం చిన్నపాటి యుద్దమే చేస్తారు. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి అర్దరాత్రి కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కల్యాణోత్సవానికి బయల్దేరుతారు. ఇదే సమయంలో ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. ఆయా గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు. అయితే ఈ సంప్రదాయంపై పోలీసులు ఎన్ని అంక్షలు విధించినా ఆనవాయితీ పేరిట ఏటా ఈ రక్తపాతం జరుగుతూనే ఉంది.