Vande Bharat mission: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. లాక్డౌన్ కారణంగా చాలా మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు.ఈ క్రమంలో వందేభారత్ మిషన్ కింద విదేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన ఎయిర్ ఇండియా విమానాల్లో 60 మంది పైలెట్లకు కరోనా సోకిందని ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఎగ్జిక్యూటివ్ పైలెట్స్ కమిటీ కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హరదీప్ సింగ్ పూరికి లేఖ రాసింది.
వందేభారత్ మిషన్ కింద మూడు దశల్లో ఇప్పటివరకు 137 దేశాల నుంచి 5,05,990 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చామని, కరోనా సంక్షోభ సమయంలోనూ సేవలందిస్తున్నందున తమ సమస్యలను పరిష్కరించాలని పైలెట్ల సంఘం మంత్రిని కోరింది. కరోనా కష్ట కాలంలో విదేశాల్లో చిక్కుకున్న మన వాళ్లను తీసుకొచ్చిన పైలెట్లకు జీతాల్లో కోత పెట్టడం సమంజసం కాదని ఎయిర్ ఇండియా పైలెట్లు అన్నారు. జీతాల్లో కోత పెట్టడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని పైలెట్లు చెప్పారు.