Kurnool: నాన్న వచ్చి బాగోగులు చెప్పి వెళ్లాడు.. కానీ బాలుడిలో మనసులో ఏదో వేదన.. దీంతో..
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఓ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తండ్రి ఇంటికి తీసుకెళ్లాలని కోరినా, చదువుపై దృష్టి పెట్టాలని సూచించి వెళ్లిపోవడంతో బాలుడు మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ప్రస్తుతం అతడు కర్నూలులో చికిత్స పొందుతుండగా, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక గురు నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థి నిశాంత్ భవనం మూడో అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోడుమూరు మండలం మాచాపురం గ్రామానికి చెందిన నిశాంత్ ఎమ్మిగనూరులోని గురు నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్నాడు. ఆదివారం అతడిని చూసేందుకు తండ్రి కోచింగ్ సెంటర్కు వచ్చారు. ఈ సందర్భంగా తనను కూడా ఇంటికి తీసుకెళ్లాలని నిశాంత్ తండ్రిని కోరినట్లు సమాచారం. అయితే చదువుకు అంతరాయం కలగకూడదని భావించిన తండ్రి, ప్రస్తుతం కోచింగ్ సెంటర్లోనే ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తండ్రి వెళ్లిపోయిన తర్వాత నిశాంత్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. కొద్దిసేపటికే కోచింగ్ సెంటర్ భవనం మూడో అంతస్తు నుంచి దూకాడు. ఇది గమనించిన కోచింగ్ సెంటర్ సిబ్బంది, తోటి విద్యార్థులు వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం నిశాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనతో కోచింగ్ సెంటర్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. విద్యార్థి కళ్లెదుటే ఈ ఘటన జరగడంతో తోటి విద్యార్థులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఈ నిర్ణయానికి దారితీసిన పరిస్థితులపై కూడా ఆరా తీస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
