పళ్లు ఉండవ్.. కానీ ఒక్క రాత్రిలో వేల చీమల్ని, చెద పురుగుల్ని తినేస్తుంది..

శరీరమంతా గట్టి పొలుసులు, ప్రమాదం కనిపిస్తే బంతిలా ముడుచుకునే అలవాటు, నాలుకతో వేలాది చీమలను తినే ప్రత్యేకత.. ఇవన్నీ పాంగోలిన్‌ను ప్రపంచంలోని అత్యంత విచిత్రమైన క్షీరదాల్లో ఒకటిగా నిలబెట్టాయి. అయితే ఈ అరుదైన జీవి ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ..

పళ్లు ఉండవ్.. కానీ ఒక్క రాత్రిలో వేల చీమల్ని, చెద పురుగుల్ని తినేస్తుంది..
Pangolin

Updated on: Jun 25, 2026 | 8:15 AM

పాంగోలిన్ ఒక క్షీరదం. అంటే ఇది గుడ్లు పెట్టదు. పిల్లలకు జన్మనిచ్చి పాలిచ్చి పెంచుతుంది. కానీ ఇతర క్షీరదాల మాదిరిగా దీనికి వెంట్రుకలు కాకుండా శరీరమంతా గట్టి కెరాటిన్ పొలుసులు ఉంటాయి. ప్రపంచంలో పొలుసులుండే ఏకైక క్షీరదం ఇదే. మన గోళ్లు, వెంట్రుకలు తయారయ్యే పదార్థమే ఈ పొలుసుల్లోనూ ఉంటుంది. నాలుగు రకాల పాంగోలిన్లు ఆసియా ఖండంలో, మరో నాలుగు రకాల పాంగోలిన్లు ఆఫ్రికా ఖండంలో జీవిస్తాయి.  సింహం, చిరుత వంటి మాంసాహార జంతువులు దాడి చేసినా పాంగోలిన్ తన తల, కాళ్లు లోపలికి ముడుచుకుని గుండ్రంగా మారిపోతుంది. దీంతో దాని గట్టి పొలుసులను ఛేదించడం చాలా కష్టం. పాంగోలిన్ నాలుక దాని శరీరం కంటే కూడా పొడవుగా ఉండొచ్చు. ఈ నాలుక చాలా జిగురుగా ఉంటుంది. చీమలు, చెదపురుగులను ఒకేసారి వందల సంఖ్యలో అంటించుకుని తింటుంది.

దంతాలు ఉండవు

ఇది ఆశ్చర్యకరమైన విషయం. పాంగోలిన్‌కు అసలు దంతాలే ఉండవు. ఆహారాన్ని నమలకుండా నేరుగా మింగేస్తుంది. తర్వాత కడుపులోని ప్రత్యేక కండరాలు, చిన్న రాళ్ల సహాయంతో ఆహారం జీర్ణమవుతుంది. ఒక పాంగోలిన్ ఒక రాత్రిలోనే వేల సంఖ్యలో చీమలు, చెదపురుగులను ఆహారంగా తీసుకుంటుంది. దీంతో అడవుల్లో కీటకాల సంఖ్య నియంత్రణలో ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. పగలు చెట్ల తొర్రల్లో లేదా బొరియల్లో విశ్రాంతి తీసుకుని, రాత్రి ఆహారం కోసం బయటకు వస్తుంది.

మనుషులే దీనికి అతిపెద్ద శత్రువులు

సహజంగా పాంగోలిన్ చాలా ప్రశాంతమైన జీవి. కానీ అక్రమ వేట కారణంగా ప్రపంచవ్యాప్తంగా దీని సంఖ్య వేగంగా తగ్గుతోంది.  దాని పొలుసులు, మాంసం కోసం కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా వేటాడుతున్నారు. చైనా సంప్రదాయ వైద్యంలో పాంగొలిన్ పొలుసులను ఉపయోగిస్తుంటారు.  అయితే పాంగోలిన్ పొలుసులకు వైద్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పే వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. పాంగోలిన్ జాతుల్లో చాలా వరకు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. అందుకే అనేక దేశాలు వీటి వేట, వ్యాపారాన్ని పూర్తిగా నిషేధించాయి. పాంగొలిన్‌లను సంరక్షించకపోతే పర్యావరణ సమతులత్య దెబ్బతింటుంది అన్నది మాత్రం వాస్తవం.  అన్నట్లు ఇవి తెలుగు రాష్ట్రాల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనవాళ్లు అలుగు అంటారు.

పిల్లలకి పాలిచ్చి పెంచుతుంది

ఆడ అలుగు(పాంగోలిన్‌) సాధారణంగా ఒకేసారి ఒక పిల్లకే జన్మనిస్తుంది. అరుదుగా రెండు పిల్లలు పుడతాయి. పుట్టినప్పుడు పిల్ల అలుగు పొలుసులు మెత్తగా ఉంటాయి. కొన్ని రోజుల్లో అవి గట్టిపడతాయి.
తల్లి అలుగు తన పిల్లకు పాలు ఇస్తూ కొన్ని నెలల పాటు సంరక్షిస్తుంది. ప్రమాదం ఎదురైతే తల్లి బంతిలా ముడుచుకుని తన శరీరంతో పిల్లను కప్పి రక్షిస్తుంది. కొంచెం పెద్దదైన తర్వాత పిల్ల అలుగు తల్లి తోకపై లేదా వీపుపై ఎక్కి ప్రయాణించడం చాలా అరుదైన, ఆసక్తికరమైన దృశ్యం. ఆ తర్వాత తల్లి వెంట తిరుగుతూ చీమలు, చెదపురుగులను ఎలా వెతికి తినాలో నేర్చుకుంటుంది. ఇదే అలుగును ఇతర క్షీరదాల నుంచి భిన్నంగా నిలబెట్టే ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. శరీరమంతా గట్టి పొలుసులు ఉన్నా, అది పిల్లలను కని పాలిచ్చి పెంచే ప్రపంచంలోని ఏకైక పొలుసుల క్షీరదం.

Follow Us