
ప్రపంచమంతా ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటోంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. అక్కడ ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. ఇటు దేశంలోనూ పలు రాష్ట్రాల్లో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర మంత్రుల వరకు.. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు.. అంతా యోగా డేను జరుపుకొనేందుకు రెడీ అయ్యారు. మరి ఈ యోగా ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి ఉంది? యోగా ప్రయోజనాలు ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
యోగా.. వ్యాయామ సాధనల సమాహారం. ఆధ్యాత్మికతకు మరో రూపం. హిందుత్వ ఆధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. అంతేకాదు.. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి వంటి ఆధ్యాత్మిక పరమైన సాధనలకు మార్గం. యోగా సాధన చేసేవారిని యోగులు అని పిలుస్తారు. ఈ యోగా ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి తోడ్పడుతుంది. యోగా ఒక్క హిందూమతానికే పరిమితం కాదు. బౌద్ధం, జైనం, సిక్కు, మొదలైన ధార్మిక మతాలలోనూ ప్రాధాన్యత కలిగి ఉంది.
‘యుజు’ అనే సంస్కృత ధాతువు నుంచి ‘యోగా’, ‘యోగం’ అనే పదం వచ్చింది. యోగం అంటే.. వ్యక్తి తన ఇంద్రియాలను నియంత్రించుకుని, వశపరచుకొని, మనస్సును భగవంతుడిపై నిమగ్నం చేయుట. మనిషి మానసిక శక్తులన్నింటినీ ఏకం చేసి, సామాన్య స్థితికి చేర్చేది యోగ. ఈ యోగాతో ఏకాగ్రత సాధించడం ద్వారా పరమార్థ తత్వాన్ని గ్రహించొచ్చు. యోగా సాధాన ద్వారా అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తి ప్రజ్వలిస్తుంది.
క్రీస్తు పూర్వం 100 – 500 శకం మధ్య కాలంలో యోగాన్ని శాస్త్రీయంగా క్రోడీకరించినట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీనికి ఆద్యుడు పతంజలి. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రామాయణం, భాగవతం, భారతం, భగవద్గీతలలోనూ ఈ యోగా ప్రస్తావన ఉంది. పతంజలి యోగా సూత్రాల్లో హఠయోగ ప్రదీపిక, శివ సంహిత ప్రధాన భాగాలు. వీటిలో కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగము, భక్తి యోగము హిందుత్వ పరంగా కీలకం. వ్యాసముని రచించిన భగవద్గీతలో యోగాసనాలను 10 భాగాలుగా విభజించడం జరిగింది.
ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. యోగాతో శారీరక, మానసిక వ్యాధులను నయం చేసుకోవచ్చు. పతంజలి మహర్షి ప్రపంచ మానవాళికి అందించిన అపురూపమైన వైద్యకానుక యోగా. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించాలంటూ భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదించింది. 175 దేశాలు దీన్ని ఆమోదించాయి. అదే సంవత్సరం డిసెంబరు 11న ప్రధాని మోదీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జూన్ 21ని ప్రకటించింది యూఎన్వో.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..