
మన భారతీయ హిందూ దేవాలయాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు; అవి వేల సంవత్సరాల భారతీయ శిల్పకళకు, జ్ఞానానికి, ఆగమ శాస్త్రానికి ప్రతీకలు. ప్రాచీన కాలంలో నిర్మించిన ప్రతి ఆలయంలో ఒక్క రాయి కూడా కారణం లేకుండా పెట్టరు. గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, నంది, గరుత్మంతుడు, ప్రాకారం, గర్భగుడి… ఇవన్నీ శాస్త్రం ప్రకారమే ఆలయ నిర్మాణంలో భాగమై ఉంటాయి. అయితే, గుడికి వెళ్లిన ప్రతిసారి దేవాలయ స్తంభాలపై కనిపించే పెద్ద కోరలు, తెరిచిన నోరు, సింహం ముఖం, ఏనుగు తొండం, గుర్రం కాళ్లతో కూడిన శిల్పం భక్తులను సందేహానికి గురిచేస్తుంది. దాన్ని చూసిన వారంతా రాక్షసుల రూపాలుగా భావిస్తారు. కానీ నిజానికి, ఈ ఉగ్రరూపాలను ‘యాళి’ అంటారు.
సమస్త శక్తుల సమాహారం
యాళి అనేది సాక్షాత్తు ఆ పరమశివుడు ప్రత్యేకంగా సృష్టించిన జీవి. మన విశాల విశ్వంలో సృష్టించబడిన ప్రతి జంతువుకూ ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది. సింహానికి ధైర్యం, ఏనుగుకు బలం, గుర్రానికి వేగం, సర్పానికి అప్రమత్తత, గరుడునికి ఆకాశాధిపత్యం ఉంటాయి. ఈ శక్తులన్నీ ఒకే రూపంలో ఉంటే ఆ రూపాన్నే ‘యాళి’ అంటారు. వీటిలోనే కొన్నింటిని ‘శరభ’ అని కూడా పిలుస్తారు. అవి కూడా చూడటానికి అచ్చం వీటిలానే ఉంటాయి. అయితే భగవంతుడు ఈ జీవిని ఎందుకు సృష్టించాడు? దీని విగ్రహాలు ఆలయాల ముఖద్వారాల్లో ఎందుకు ఉంటాయనే సందేహం కలగవచ్చు.
శరభావతార పురాణ గాథ
పురాణాల ప్రకారం, శ్రీమహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత ఆయన క్రోధాన్ని అదుపు చేయడం ఎవరి తరం కాలేదు. ఆయన ఉగ్రరూపాన్ని చూసి దేవాదిదేవులంతా భయంతో మహాదేవుడైన శివుడి వద్దకు వెళ్లారు. నరసింహుడి క్రోధాన్ని శాంతింపజేసేందుకు శివుడు తొలుత వీరభద్రుడిని పంపించాడు. కానీ ఆయన సైతం మహావిష్ణువును నిలువరించలేకపోయాడు. దీంతో నేరుగా ఆ ముక్కంటి ఈశ్వరుడే వెళ్లి నరసింహుడితో మాట్లాడి, “నీ క్రోధం ముల్లోకాలను వణికిస్తోంది… దాన్ని అణచుకోవాలి” అని చెబుతాడు. కానీ నరసింహుడు శివుడి మాటలను లెక్కచేయడు.
అప్పుడు శివుడు విశ్వం ఎన్నడూ చూడని ఒక భయంకరమైన రూపాన్ని దాలుస్తాడు. ఆ రూపం పేరే ‘శరభ’. సింహపు ధైర్యం, ఏనుగు బలం, గుర్రపు వేగం కలగలిసిన ఆ శక్తితో శివుడు నరసింహుడితో తలపడతాడు. దాంతో క్రమంగా నరసింహుడి క్రోధం తగ్గుతుంది. దైవ క్రోధానికి కూడా హద్దులు ఉంటాయని ఇది నిరూపిస్తుంది. ఆలయంలోకి ఎంతటి శక్తిమంతులు వచ్చినా, వారిని అడ్డుకునేందుకు అంతకుమించిన శక్తులు ఉంటాయని తెలియజేయడానికే వీటిని ఆలయాలపై ఏర్పాటు చేశారని పురాణాలు చెబుతాయి.
ఆధ్యాత్మిక అంతరార్థం
దేవాలయం పరమాత్మ నివాసం. ఆ పరమాత్మను చేరుకోవాలంటే మనలోని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే ఆరు అంతర్గత శత్రువులను దాటాలి. యాళి రూపం అపరిమిత శక్తిని సూచిస్తుంది; ఆ శక్తి ఎల్లప్పుడూ ధర్మానికే కట్టుబడి ఉండాలని చెబుతుంది. అందుకే దేవాలయ ద్వారాల వద్ద, మండప స్తంభాలపై ఈ శిల్పాలు కనిపిస్తాయి. ఇవి ఆలయాన్ని రక్షించే రక్షక శక్తులుగానూ, భక్తులకు ఆధ్యాత్మిక స్ఫూర్తినిచ్చే ప్రతీకలుగానూ నిలుస్తాయి.
ఇందుకు సంబంధించిన పోస్ట్ చూడండి..
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.