Animal Intuition: ప్రకృతిలో దాగివున్న అలర్ట్ సిస్టమ్.. మనుషుల కంటే వేగంగా ప్రమాదాన్ని పసిగట్టే 8 జంతువులివే
మనుషులు ఆధునిక సాంకేతికతతో ఎంతగా అభివృద్ధి చెందినా, ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించడంలో జంతువుల సహజ సిద్ధమైన శక్తుల ముందు మనం ఎప్పుడూ వెనకబడే ఉంటాం. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు లేదా తుఫానులు సంభవించే ముందు మనకు అర్థం కాని సూక్ష్మమైన సంకేతాలను ఇవి పసిగడతాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన ఇంద్రియాల వల్ల ప్రమాద సంకేతాలను గుర్తించి, ప్రాణాలను కాపాడుకోవడంలో ఈ 8 జంతువుల సంకేతాలు ఉపయోగపడతాయి.

ప్రకృతిలో సంభవించే మార్పులను గ్రహించడానికి జంతువులు తమకు లభించిన ప్రత్యేకమైన ఇంద్రియాలను ఉపయోగిస్తాయి. అవి పర్యావరణంలో వచ్చే చిన్నపాటి మార్పులను కూడా ఒక పెద్ద ప్రమాద హెచ్చరికగా భావిస్తాయి. అటువంటి అద్భుత సామర్థ్యం గల జీవుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
భూవాతావరణ మార్పులను పసిగట్టే జీవులు: ఏనుగులు తమ తొండాలు పాదాల ద్వారా భూమి లోపలి నుంచి వచ్చే అతి తక్కువ పౌనఃపున్య ధ్వనులను (ఇన్ఫ్రాసౌండ్) గ్రహించగలవు. వందల మైళ్ల దూరంలో ఉన్న సునామీ లేదా తుఫానులను ఇవి సులభంగా పసిగట్టి, ఎత్తైన ప్రాంతాలకు తరలిపోతాయి. అలాగే, పాములు ఎలుకలు భూ ప్రకంపనలను అత్యంత సున్నితంగా స్పందించగలవు. భూకంపం రావడానికి కొన్ని రోజుల ముందే పాములు బొరియల నుండి బయటకు రావడం, ఎలుకలు నిర్మాణాలు కూలిపోయే ముందు అప్రమత్తమై పారిపోవడం మనం చూస్తూనే ఉన్నాం.
పక్షులు, కీటకాలు, నీటి జీవుల హెచ్చరికలు: వలస పక్షులు తుపానులు లేదా అగ్నిపర్వత విస్ఫోటనాలకు ముందు ఇన్ఫ్రాసౌండ్ను గ్రహించగలవు. ఇక సొరచేపలు తమ శరీరంలోని ‘ఆంపుల్లా ఆఫ్ లొరెంజిని’ అనే ప్రత్యేక అవయవం ద్వారా నీటిలో కలిగే స్వల్ప విద్యుత్ మార్పులను, పీడనంలో తేడాలను బట్టి తుఫానులను ముందే అంచనా వేస్తాయి. తేనెటీగలు గాలి పీడనం తేమలో వచ్చే మార్పులను పసిగట్టి, తుఫానుకు ముందే తమ తేనెపట్టులకు చేరుకుంటాయి. క్యాట్ఫిష్లను జపాన్లో భూకంప హెచ్చరిక జీవులుగా భావిస్తారు.
ఇవి నీటిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల కలిగే విద్యుత్ మార్పులను గుర్తించి అసాధారణంగా ప్రవర్తిస్తాయి. కుక్కలకైతే మనుషుల కంటే లక్ష రెట్లు ఎక్కువ వాసన పసిగట్టే శక్తి ఉంటుంది, ఇవి గాలి పీడనంలో మార్పులను కూడా గుర్తించి యజమానులను అప్రమత్తం చేస్తాయి. ఈ జీవులన్నీ ప్రకృతిలో భాగస్వాములుగా, వాతావరణంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ జీవన రక్షణను పొందుతున్నాయి.
