
సాంకేతిక విప్లవం పుణ్యమా అని ప్రస్తుతం ఇంట్లోనే ఉండి పని చేసే (Work From Home) వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆఫీసు వాతావరణానికి దూరంగా, మనకు నచ్చిన చోట కూర్చుని పని చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, దీని వల్ల శారీరక శ్రమ తగ్గిపోతోంది. గంటల తరబడి ఒకే చోట కూర్చుని ఉండటం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వర్క్ ఫ్రమ్ హోమ్ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మారుతున్న ఈ జీవనశైలికి అనుగుణంగా మన డైట్లో మార్పులు చేసుకోవడం ఇప్పుడు అత్యంత ఆవశ్యకం.
మొదటిది ‘అట్కిన్స్ డైట్’. దీనిని న్యూట్రిషన్ నిపుణుడు రాబర్ట్ అట్కిన్స్ రూపొందించారు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప మార్గం. ఇందులో ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో, ఏవి వద్దో స్పష్టమైన జాబితా ఉంటుంది. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేయడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కలిగే అనవసరపు ఆకలిని తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది. ఇక రెండవది ‘ఆయుర్వేద ఆహారం’. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడి వల్ల చాలామంది బరువు పెరుగుతున్నారు. ఈ డైట్ కేవలం ఆహారంపైనే కాకుండా మానసిక స్థితిపై కూడా దృష్టి పెడుతుంది. శరీరంలోని ఎనర్జీలను బ్యాలెన్స్ చేస్తూ తీపి, పులుపు, వగరు వంటి షడ్రుచుల సమ్మేళనంతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం దీని ప్రత్యేకత.
మరో అద్భుతమైన మార్గం ‘వెజిటేరియన్ డైట్’. శాఖాహారంలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల కలిగే మలబద్ధకం వంటి సమస్యలను ఇది నివారిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుత పరిస్థితుల్లో శాఖాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతూనే బరువు అదుపులో ఉంటుంది. వీటితో పాటు పని మధ్యలో చిన్నపాటి విరామాలు తీసుకుంటూ నీరు పుష్కలంగా తాగడం అలవాటు చేసుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తూనే రోజూ కొంత సమయం శారీరక శ్రమకు కేటాయించడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ లైఫ్ స్టైల్ను మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు.