ఇంట్లో సమస్యలున్నాయి అన్నాడు.. ఊరి పొలిమేరలో పూజలన్నాడు.. అందినకాడికి దోచుకుని పరారయ్యాడు
కొద్ది రోజులుగా ఏజెన్సీలో కేటుగాళ్లు మాటువేశారు. మాయమాటలతో అమాయకులకు వలవేసి బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు.

కొద్ది రోజులుగా ఏజెన్సీలో కేటుగాళ్లు మాటువేశారు. మాయమాటలతో అమాయకులకు వలవేసి బురిడీ కొట్టిస్తున్నారు. అందినకాడికి దోచుకుని ఉడాయిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల పరిధిలోని దాచవరం గ్రామంలో ఓ మహిళను నమ్మించి ఆమె బంగారు ఆభరణాలను ఓ భూతవైద్యుడు లూటీ చేసిన ఘటన కలకలం రేపింది.
దాచవరం ఎస్సీ కాలానికి చెందిన ఓ గృహిణిలో ఇంటిపనుల్లో బిజీగా ఉంది. భర్త పొలం పనులకు వెళ్లటంతో…ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గమనించిన ఓ భూతవైద్యుడు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇంట్లో లేనిపోని సమస్యలు, బాధలు మిమ్మల్ని పట్టిపీడిస్తున్నాయని నమ్మించాడు. అవి తొలగిపోవాలంటే, ఇంట్లో ప్రత్యేక పూజలు చేయాలని, లేకపోతే, మీ ఫ్యామిలీ మరిన్ని చిక్కుల్లో పడుతుందని, ఆర్థికంగా దెబ్బతింటుందని ఆమెను భయబ్రాంతులకు గురిచేశాడు. మాయల మాంత్రీకుడి మాటలకు భయపడిపోయిన బాధితురాలు చేసేది లేక ప్రత్యేక పూజలకు ఒప్పుకుంది.
అయితే, పూజల కోసం బంగారు ఆభరణాలను పెట్టాలని కోరాడు. అవి ఊరి పొలిమేరలో పెట్టి పూజలు చేసి వచ్చే లోపు స్నానం చేసి ఇంట్లో కొవ్వుతులు వెలిగించి ఉండమని చెప్పాడు. గంటలు గడుస్తున్నా..భూతవైద్యుడు తిరిగిరాకపోవడంతో..మోసపోయాయని గ్రహించిన బాధితురాలు..చుట్టుపక్కల జనాలకు సమాచారం ఇచ్చింది. స్థానికులతో కలిసి అంతా వెతికినా కేటుగాడి ఆచూకీ కనిపించలేదు. చివరకు చేసేది లేక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
Also Read:
ఆలయం గాలి గోపురానికి రంధ్రం చేసి పురాతన నాణేల చోరి.. పోలీసులు విచారణలో తేలింది ఏంటంటే..?