
వేణు తొట్టెంపూడి.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు వేణు. ఒకప్పుడు వరుసగా సినిమాలతో అలరించిన వేణు.. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చారు వేణు. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు వెబ్ సిరీస్ లతో ఆకట్టుకున్నారు వేణు. వేణు గతంలో ఓ ఇంటర్వూలో అనేక విషయాలను పంచుకున్నారు. సినిమాలకు దూరంగా ఉండటానికి కొన్ని అనివార్య కారణాలు ఉన్నాయని వేణు తొట్టెంపూడి తెలిపారు. ఈ బ్రేక్ సమయంలో, ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో, కుటుంబంతో గడపడానికి సమయం దొరికిందని ఆయన పేర్కొన్నారు. ఈ కాలంలో ఓటీటీ వేదికలలో మంచి కంటెంట్ను చూసి, ఇతర నటుల అద్భుతమైన నటనను చూసి తిరిగి నటించాలనే కోరిక పెరిగిందని ఆయన పంచుకున్నారు. “మనం కూడా చేయాలి కదా” అనే చిన్న ఆలోచన నుండే ఆయన పునరాగమనం మొదలైంది.
రామారావు ఆన్ డ్యూటీ ప్రాజెక్ట్ అనుకోకుండా తన వద్దకు వచ్చిందని వేణు తెలిపారు. దర్శకుడు శరత్ మండవ మరియు ఎస్.ఎల్.వి. బ్యానర్ ప్రతినిధులు మొదట్లో సంప్రదించినప్పుడు, తాను నటనకు దూరంగా ఉన్నానని చెప్పి తిరస్కరించానని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, దర్శకుడు శరత్ మండవ పట్టుదలతో “మీరు సినిమా చేయకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను” అని మెసేజ్ పంపడంతో వేణు వారిని కలుసుకున్నారు. “నాకు మీరే కావాలి” అని శరత్ మండవ పట్టుబట్టడంతో, నమ్మకంతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు వేణు వెల్లడించారు.
రామారావు ఆన్ డ్యూటీతో పాటు, వేణు తొట్టెంపూడి చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న పారా హుషార్ చిత్రంలో కూడా ఒక కీలక పాత్రలో నటించారు. భవిష్యత్తులో మరిన్ని ఓటీటీ వెబ్ సిరీస్లలో ప్రధాన పాత్రలు పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు, అందుకు సంబంధించిన ప్రాజెక్టులు త్వరలో మొదలు కానున్నాయని ఆయన వెల్లడించారు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడే వేణు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని తెలిపారు.