RB Chaudhary: టాలీవుడ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో సుమారు 100కి పైగా చిత్రాలను నిర్మించి స్టార్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆర్బీ చౌదరి కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

RB Chaudhary: టాలీవుడ్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత దుర్మరణం
RB Chaudhary

Updated on: May 05, 2026 | 7:55 PM

తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో దాదాపు 100కి పైగా చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి కన్నుమూశారు. ఓ పని నిమిత్తం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన చౌదరి, అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చేర్చినప్పటికీ తీవ్ర గాయాలు కావడంతో కోలుకోలేక ఆయన తుది శ్వాసవిడిచారు. ఈ దుర్వార్త విన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు ఆర్బీ చౌదరి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన పార్థివ దేహాన్ని మే 6న (బుధవారం) చెన్నైకి తరలించనున్నారు. అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా రంగం,  యాత్ర 2 సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన కోలీవుడ్ హీరో జీవా ఆర్బీచౌదరి కుమారుడే.

ఆర్బీ చౌదరి 1988లో ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. అదే సంవత్సరంలో ‘అధిపాపం’ అనే మొదటి మలయాళ చిత్రాన్ని కూడా నిర్మించారు. ఆ తర్వాత 1990 నుండి తన ‘సూపర్ గుడ్’ నిర్మాణ సంస్థ కింద తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ సినిమాలు నిర్మించడం ప్రారంభించారు.  తెలుగులో ఆర్‌బీ చౌదరి నిర్మించిన రాజా, సూర్యవంశం, సుస్వాగతం చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఓవరాల్ గా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాలను నిర్మించారీ స్టార్ ప్రొడ్యూసర్.  చివరిగా ఆయన ‘మరీసన్’ అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు.  ఇక ఆర్బీ చౌదరి ఇద్దరు కుమారులు, జితన్ రమేష్  జీవాలు కూడా హీరోలుగా పరిచయం కావడం గమనార్హం. కాగా ఆర్బీ చౌదరి రెగ్యులర్ గా ఉదయ్ పూర్ కు వెళుతుంటారు. అలా మంగళవారం (మే 05) కూడా వెళ్లగా దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు.  వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించగా, చికిత్స  పొందుతూ మరణించారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల నివాళులు

 

పవన్ కల్యాణ్ సంతాపం.

ఆర్బీ చౌదరి మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు.  ‘ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని రాసుకొచ్చారు పవన్.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us