
రాయలసీమ ప్రాంతానికి చెందిన మహేష్ విట్టా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాయల సీమ యాసలో అతను చెప్పిన డైలాగులు నెట్టింట బాగా వైరలయ్యాయి. ఇదే ఫేమ్ తో సినిమాల్లోకి అడుగు పెట్టాడు మహేష్. కృష్ణార్జున యుద్ధం, కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్ప్రెస్, ఇందు వదన తదితర సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే బిగ్బాస్ 3వ, ఓటీటీ సీజన్లోనూ సందడి చేశాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటోన్న మహేష్ ఒక శుభవార్త చెప్పాడు. త్వరలో తాను తండ్రిగా కాబోతున్న శుభవార్తను అందరితో పంచుకున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం గర్భంతో ఉన్న తన భార్యతో కలిసున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు మహేష్. ‘ మా కథలోకి మరొకరు వస్తున్నారు. త్వరలోనే మేం ముగ్గురం కాబోతున్నాం’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు మహేష్.
ప్రస్తుతం ఈ టాలీవుడ్ కమెడియన్ షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మహేష్ దంపతులకు అభినందనలు, ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మహేష్ విట్టా 2023 సెప్టెంబర్ లో శ్రావణి రెడ్డి అనే అమ్మాయితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు. వీరిది ప్రేమ వివాహం. శ్రావణి మరెవరో కాదు మహేశ్ విట్టా చెల్లెలి ఫ్రెండే. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమించుకున్న వీళ్లిద్దరూ.. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ ప్రేమ బంధానికి ప్రతిరూపంగా పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారీ లవ్లీ కపుల్.