
తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటుడు రాజనాల కాళేశ్వరరావు జీవితం, వైభవం నుంచి విషాదం వరకు అనేక మలుపులతో నిండి ఉంది. 1928 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన రాజనాల నాటకాలపై మక్కువతో ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సినిమా రంగంలోకి ప్రవేశించారు. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ చిత్రంతో విలన్గా తన అరంగేట్రం చేసి, ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. తన పదునైన కళ్ళు, క్రూరమైన చూపు, వికటాట్టహాసంతో ప్రతినాయకుడి పాత్రలకు ప్రాణం పోశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు వంటి అగ్రశ్రేణి నటుల చిత్రాలలో రాజనాల ప్రతినాయకుడిగా రాణించారు. కంసుడిగా, జరాసంధుడిగా, శ్రీకృష్ణ పాండవీయంలో శిశుపాలుడిగా, అల్లూరి సీతారామరాజులో బ్రిటిష్ మేజర్ గూడాల్గా ఆయన నటనా ప్రతిభ అద్వితీయం. జానపద చిత్రాల బ్రహ్మ విఠలాచార్య సినిమాలలో రాజనాల పాత్ర తప్పనిసరి ఉండేది. 1966లో మాయా ది మ్యాగ్నిఫిషెంట్ అనే హాలీవుడ్ చిత్రంలో నటించి, హాలీవుడ్లో నటించిన తొలి తెలుగు నటుడిగా చరిత్ర సృష్టించారు.
కేవలం విలన్గానే కాకుండా, జగదేకవీరుని కథ, రేచుక్క పగటిచుక్క వంటి చిత్రాలలో హాస్యాన్ని కూడా పండించి తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. దాదాపు 400 పైచిలుకు చిత్రాలలో నటించి, ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా లక్షల్లో సంపాదించారు. సూర్యకాంతం గారి గయ్యాళి అత్త పాత్రలను చూసి పని మనుషులు భయపడినట్టు, రాజనాల క్రూరమైన విలన్ పాత్రలను చూసి నిజ జీవితంలో కూడా ప్రజలు దూరంగా పారిపోయేవారు. 1968లో వరకట్నం సినిమా షూటింగ్లో తాడేపల్లిగూడెంలో ఒక విచిత్రమైన అనుభవం రాజనాలకు ఎదురైంది. ఆయన్ను చూసి మహిళలు భయపడి పరుగులు తీశారు. అయితే, ఆయన జీవితపు చివరి రోజులు విషాదంతో నిండిపోయాయి.
“చేతికి ఎముక లేదన్నట్టుగా” దానధర్మాలు చేయడం వల్ల సంపాదించినదంతా కోల్పోయారు. నిర్మాతగా భీమాంజనేయ అనే సినిమా తీయాలనుకున్న కోరిక ఆర్థిక కష్టాల వల్ల నెరవేరలేదు. 1979లో భార్య మరణం ఆయన పతనానికి ఆరంభంగా నిలిచింది. 1984లో కుమారుడు కులవర్థన్ మూర్ఛ వ్యాధితో కన్నుమూశారు. మరో కుమారుడు కాళీచరణ్ ముంబైలో అదృశ్యమయ్యారు. కూతురికి అప్పటికే పెళ్ళి జరిగిపోయింది. కూతురు, అల్లుడికి భారం కావడం ఇష్టం లేక, 1991లో మద్రాసులోని తన ఆస్తులన్నీ అమ్మివేసి రెండో భార్యతో సహా హైదరాబాద్కు వచ్చారు. ఒకసారి ఆర్థిక సహాయం కోసం శోభన్ బాబు ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో వీరాభిమన్యు చిత్రం షూటింగ్లో శోభన్ బాబును అవమానించిన రాజనాల, ఆయన సహాయం కోరడానికి వెళ్ళినప్పుడు సందేహించాట. అయితే శోభన్ బాబు అవేమి పట్టించుకోకుండా..రూ. 20,000 కు పైగా డబ్బు ఇచ్చి పంపించారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలలో అవకాశాలు వచ్చినా, 1995లో తెలుగు వీర లేవరా సినిమా షూటింగ్ సమయంలో కాలికి దెబ్బ తగిలి ఇన్ఫెక్షన్ అయింది. మధుమేహం కారణంగా వైద్యులు ఒక కాలు తొలగించారు. చివరి రోజుల్లో ఆర్థిక కష్టాలు తారస్థాయికి చేరడంతో జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించారు. చివరికి, తీవ్ర అనారోగ్యానికి గురైన రాజనాల 1998 మే 21న గుండెపోటుతో రాజనాల కన్నుమూశారు.