
శ్రీహరి.. తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. స్టంట్ మాస్టర్గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా సత్తా చాటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయిన శ్రీహరి ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. పోలీస్, బలరాం, గణపతి, విజయ రామరాజు, అయోధ్య రామయ్య, శివాజీ, మా ఆయన సుందరయ్య, ఒరేయ్ తమ్ముడు, ఎవడ్రా రౌడీ, భద్రాచలం, పరశురాం, కుబుసం, ఒక్కడే, హనుమంతు, శ్రీ మహాలక్ష్మి, మగధీర, ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు శ్రీహరి. అయితే స్టార్ నటుడిగా బిజీగా ఉంటోన్న సమయంలోనే ఆయన కన్నుమూయడం కుటుంబ సభ్యులతో పాటు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. 2013 అక్టోబర్ 9న ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిన ఆయన తీవ్ర ఆస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. కాలేయ సంబంధ సమస్యలతోనే శ్రీహరి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
శ్రీహరి అకాల మరణం ఆయన కుటుంబ సభ్యులనే కాకుండా సినీ ప్రముఖులు, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఆయన చనిపోయినా తన సినిమాలతో ఇప్పటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయారు రియల్ స్టార్. ఇదిలా ఉంటే నటుడు శ్రీహరి మరణంపై ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గతంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీహరి చనిపోయే విషయం ఆయనకు మూడు నెలల ముందే తెలుసని, అందుకే ఆయన క్రమంగా సినిమాలను తగ్గించుకున్నారని భరద్వాజ్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో తన కుటుంబంతోనే గడిపపేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారని ఆయన పేర్కొన్నారు.
కాగా శ్రీహరి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కుమారుడు మేఘాంశ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సుమారు ఐదేళ్ల క్రితం రాజ్ దూత్ అనే సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మేఘాంశ్ ఇప్పుడు స్టూడెంట్ అనే ఓ పవర్ ఫుల్ సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.