ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు కుటుంబసభ్యులు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించారు.
1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత రెండో అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా..పత్రికా సంపాదకులుగా..ప్రచురణకర్తగా..సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు రామోజీరావు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు.
రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలున్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు రామోజీరావు. 1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ స్థాపించిన రామోజీరావు..వ్యాపారంలోను ముందుకెళ్లారు. 1974 ఆగస్ట్ 10న విశాఖ వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానెల్స్ను తీసుకొచ్చారు రామోజీరావు. ఉషాకిరణ్ మూవీస్ కింద 30వరకు సినిమాలు నిర్మించారు రామోజీరావు. ఆయన నిర్మించిన సినిమాల్లో శ్రీవారికి ప్రేమలేఖ మొదటిది. 1984 లో ఈసినిమా తెరకెక్కింది. అలాగే రామోజీరావు చాలా మంది హీరోలను పరిచయం చేశారు . ఉదయ్ కిరణ్ ను పరిచయం చేస్తూ చిత్రం అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే తరుణ్ ను పరిచయం చేస్తూ..నువ్వే కావలి సినిమాను నిర్మించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ఆనందం సినిమాను కూడా రామోజీరావే నిర్మించారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాను కూడా ఉషాకిరణ్ మూవీస్ నిర్మించింది. తనీష్ ను హీరోగా పరిచయం చేస్తూ.. నచ్చావులే సినిమా నిర్మించారు. ఇక ఆయన నిర్మించిన చివరి సినిమా దాగుడుమూత దండాకోర్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.