
గతంలో ఓ ప్రముఖ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణికి లభించిన గౌరవ డాక్టరేట్పై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వర్మ మాట్లాడుతూ.. తాను వెరీ బ్యాడ్ బ్యాక్ బెంచర్నని, సాహిత్య వేదికలు, పండితులు, రచనలు చూసి తన అన్ ఎడ్యుకేషన్ బయటపడిపోతుందేమోనని మొదట కొంత టెన్షన్గా, నిశ్శబ్దంగా కూర్చున్నానని వర్మ అన్నారు. అయితే, తనికెళ్ళ భరణికి డాక్టరేట్ లభించడం గురించి వినగానే తాను నిజంగా ఆశ్చర్యపోయానని, ఈ గౌరవం ఆయనకు ఎప్పుడో రావాల్సిందని భావించానని వర్మ అన్నారు. తనకు భరణి తెలిసినప్పటి నుంచి ఆయన భాషపై, జీవితం పట్ల, మనుషుల పట్ల గొప్ప అవగాహన ఉన్న అత్యంత తెలివైన వ్యక్తిగా భావించానని గుర్తు చేసుకున్నారు వర్మ. తాను శివ సినిమా తీయకముందు నుంచే భరణి తనకు తెలుసని పేర్కొన్నారు.
ఎస్.ఆర్. యూనివర్సిటీ భరణికి డాక్టరేట్ ప్రదానం చేయడంపై “మిగతా యూనివర్సిటీలందరికీ వాళ్ళకి ఇంకా కళ్ళు తెరవలేదా ఏంటో నాకు అర్థం కాలేదు” అంటూ చమత్కరించారు. అయితే, ఎస్.ఆర్. యూనివర్సిటీ కళ్ళు తెరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు వర్మ. భరణి అటువంటి గుర్తింపునకు పూర్తిగా అర్హుడని, ఆయనతో ఈ క్షణాన్ని పంచుకోవడం పట్ల చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నానని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. చాలాసార్లు యూట్యూబ్ వీడియోలలో భరణి తన గురించి ఒక వింత జంతువు లాగా మాట్లాడతారని వర్మ గుర్తు చేశారు. అదంతా శివ సినిమా సమయంలో తమకున్న అనుభవాలని వివరించారు.
అలాగే ఈ కార్యక్రమంలో తనికెళ్ళ భరణి గురించి చిన్నపిల్లలు పాడిన పాటను వర్మ ఎంతగానో ఆస్వాదించారు. ఆ పాట భరణి చరిత్రను, ఆయన చేసిన కృషిని అద్భుతంగా సంగీతంలో కంపోజ్ చేసిందని ప్రశంసించారు. ఈ సందర్భంగా, మంజు భార్గవిని ప్రత్యేకంగా ప్రశంసించారు. “పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని, ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను” అంటూ వర్మ మంజు భార్గవి భారతీయ సంగీతానికి చేసిన సేవలను కవిత్వ రూపంలో కొనియాడారు. తన ఫిల్మ్ వాచింగ్ కెరీర్లో గ్లామర్ కోసం కాకుండా హీరోయిన్ను గౌరవంతో చూసింది కేవలం మంజు భార్గవినే అని పేర్కొంటూ ఆమెపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు వర్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.