
రాజాసాబ్ సినిమాలోని 2వ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా లులు మాల్కు వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్ను అభిమానుల పేరుతో కొందరు చుట్టుముట్టి.. ఆమె మీద పడుతూ ఇబ్బంది పెట్టారు. దీంతో హీరోయిన్ నిధి తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. ఈ ఘటన తాలూక వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దీనిపై లులు మాల్తో పాటు ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన శ్రేయాస్ మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలానే.. అభిమానుల ముసుగులో ఉన్న ఆకతాయిలపై కూడా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తాజాగా పోలీసులు నిధి అగర్వాల్లో కాంటాక్ట్ అయ్యారు. అయితే అందుకు ఆమె నో చెప్పింది. తనకు ఎవరిపై కేసు పెట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేసిందట. ఇంత వరస్ట్గా బిహేవ్ చేసినా.. ఆమె లైట్ తీసుకుంది. ఇకనైనా మారండ్రా అంటూ కొందరు నెటిజన్లు నెట్టింట కామెంట్స్ పెడుతున్నారు.
సహనా పాటను KPHBలోని లులు మాల్లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్ను ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఈవెంట్ తర్వాత బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. కారు దగ్గరకు వెళ్లేందుకు కూడా ఛాన్స్ లేనంతగా తోపులాట మొదలైంది. ఎట్టకేలకు సెక్యూరిటీ సాయంతో అక్కడి నుంచి బయటపడింది నిధి అగర్వాల్. బయటకు వస్తున్నప్పుడు, కార్ ఎక్కిన తర్వాత నిధి ఫేస్ చూస్తే ఎంతగా భయపడిందో.. ఫ్యాన్స్ అతికి ఎంతగా వణికిపోయిందో క్లియర్గా కనిపిస్తోంది.
అంతా తోసుకుంటూ మీదపడిపోతుండడంతో జనాల్ని కంట్రోల్ చేయడం, నిధిని బయటకు తీసుకురావడం ఓ మినీ యుద్ధాన్ని తలిపించింది..
సంక్రాంతి కానుకగా వచ్చేనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది రాజాసాబ్. ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన డ్యూయట్ని రిలీజ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ ఈవెంట్ కోసం వచ్చిన నిధి అగర్వాల్కి ఫ్యాన్స్ ఇలా నరకం చూపించారు.
ఫ్యాన్డమ్ ముదిరి, పిచ్చి పీక్స్లోకెళితే అవతల మేలా ఫిమేలా అని తేడా లేదు.. హీరోయినైనా, హీరో ఐనా సరే.. టార్గెట్ అవ్వాల్సిందే. మొన్న నిధి అగర్వాల్.. లేటెస్ట్గా సమంత.. అంతకుముందు కొందరు కథానాయకులు కూడా ఆత్మగౌరవాలు ఖర్చైపోయి.. లోపల్లోపల ఏడ్చుకున్నవాళ్లే.
ఎస్, పబ్లిక్లోకి వస్తే చాలు గ్లామర్ ఐకాన్లకు నరకం కనిపిస్తోంది. ఫ్యాన్స్ను దాటుకుని, ఈవెంట్ను పూర్తి చేసుకుని ఇంటికి క్షేమంగా వెళ్లడం పెద్ద సవాల్గా మారుతోంది. సెల్ఫీల కోసం, షేక్ హ్యాండ్ కోసం ఎగబడ్డం వరకూ ఓకే. అవతలి వాళ్ల ప్రైవసీని దెబ్బతీస్తూ, వాళ్లు పడే ఇబ్బందిని అస్సలు పట్టించుకోకుండా తెగబడితే, దాన్నేమనాలి? అభిమానం ముసుగులో జరుగుతున్న ఒకానొక అరాచకం కాదా ఇది?
అభిమానం హద్దులు దాటి వెర్రితలలు వేసినప్పుడు, హీరోయిన్స్ అయినా, హీరోలైనా వాళ్లకొక్కటే. వినడానికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ, కథానాయకుల కష్టాలు కూడా మాటలకు అందనంత దారుణంగా ఉంటాయి. లులూమాల్లో జరిగిన ఈవెంట్ క్లయిమాక్స్లో మేల్ సెలబ్రిటీల్ని కూడా చుట్టుముట్టి నానాయాగీ చేశారు ఫ్యాన్స్. శరీరంలో ఎక్కడంటే అక్కడ తాకడం, ఆవిధంగా రాక్షసానందం పొందడం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్.. ఇలా ఫ్యాన్స్ శాడిజాన్ని భరించలేక భరించినవాళ్లే. వ్యక్తిగత ప్రైవసీని దెబ్బ తీసేలా వికృత చేష్టలకు పాల్పడుతూ, సెల్ఫీల పేరుతో మీద పడుతుంటే.. సెలబ్రిటీలకు సినిమా కనిపిస్తోంది. పబ్లిక్లోకెళితే న్యూసెన్స్ తప్పదని తెలుసు. కానీ, నవ్వుతూ భరించడమే వాళ్లకుండే ఒకేఒక ఆప్షన్. అదుపు తప్పుతున్న పోకిరీ గ్యాంగ్ ఓ కారణమైతే సరైన క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం ఇక్కడ మరో కారణం ఔతోంది. అందుకే ఇలాంటి వాళ్లకు బాలయ్యే కరెక్ట్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి నెట్టింట.