Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..

| Edited By: Rajitha Chanti

Feb 07, 2022 | 2:52 PM

సినీ రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) ప్రోత్సాహాన్ని అందించిన వారిలో రాజ్‌కపూర్‌ (Raj Kapoor) కూడా ఉన్నాడు. రాజ్‌కపూర్‌,

Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..
Lata Ji
Follow us on

సినీ రంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో లతా మంగేష్కర్‌కు (Lata Mangeshkar) ప్రోత్సాహాన్ని అందించిన వారిలో రాజ్‌కపూర్‌ (Raj Kapoor) కూడా ఉన్నాడు. రాజ్‌కపూర్‌, శంకర్‌ జైకిషన్‌, శైలేంద్ర, హస్రత్‌ జైపూరి, మహ్మద్‌ రఫీ, ముకేశ్‌, మన్నాదేల కాంబినేషన్‌తో లతా మంగేష్కర్‌ అద్భుతమైన పాటలు పాడారు. రాజ్‌కపూర్‌కు లతామంగేష్కర్‌ అంటే ఎంతో అభిమానం. ఎంతగా అంటే లతా మంగేష్కర్‌ కోసమే బాబీ సినిమాకు తనకు అత్యంత సన్నిహితులైన శంకర్‌-జైకిషన్‌లను తప్పించి లక్ష్మీ కాంత్‌-ప్యారేలాల్‌ను ఎంచుకునేంతగా! శంకర్‌తో లతాకు ఏర్పడిన మనస్పర్థలే అందుకు కారణం. ఇదలా ఉంచితే 1978లో రాజకపూర్‌ సత్యం శివం సుందరం అన్న సినిమా తీశారు. లతా మంగేష్కర్‌ స్ఫూర్తితోనే తాను ఈ సినిమాను నిర్మించ తలపెట్టానని రాజ్‌కపూర్‌ చెప్పడంతో వివాదం మొదలయ్యింది. రాజకపూర్‌ అలా స్టేట్‌మెంట్‌ ఇచ్చేసరికి లతాకు మండింది. ఆ సినిమాకు పాడనని మొండికేసింది. రికార్డింగ్‌ సిద్ధమైన పాటను పాడకుండా తప్పించుకుని తిరిగింది. రాజ్‌కపూర్‌కు ఏం చేయాలో తోచలేదు. ఆర్‌కే బ్యానర్‌ సినిమాలకే లతా పాడనని చెప్పడం నిజంగా సంచలనమే. ఎందుకంటే ఆర్‌కే బ్యానర్‌లో వచ్చిన బర్సాత్‌ సినిమాతోనే లతా స్టార్‌ సింగర్‌గా ఎదిగింది. ఆ తర్వాత ఆ బ్యానర్‌లో లతాపాడిన ప్రతీ పాట హిట్టే! అలాంటిది రాజకపూర్‌ అన్న మాటలకు లతా కోపం ఎందుకు తెచ్చుకుంది? అంటే అందుకు కారణం సత్యం శివం సుందరం సినిమా కథ నేపథ్యం. ఆ సినిమాలో హీరోయిన్‌ అందంగా ఉండదు. ఎప్పుడూ మొహానికి సగం ముసుగు వేసుకుని ఉంటుంది. కాకపోతే అద్భుతమైన స్వరం ఉంటుంది. హీరో ఆమె పాడిన పాట వినే ఆమెను ప్రేమిస్తాడు. . పెళ్లి చేసుకుంటాడు. శోభనం రోజున ఆమె ముసుగు తొలగించి నివ్వెరపోతాడు. ఆమెను వదిలేస్తాడు. సౌందర్యం అంటే ఏమిటి? సత్యం అంటే ఏమిటి? శారీరకమైన అందం కావాలా? అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చే గాత్రం కావాలా? ఇదీ సినిమా మూల కథ. ఇక్కడే లతాకు సంకటం ఎదురయ్యింది. సినిమాకు ఇన్సిప్రేషన్‌ తానేనని అంటే తాను అందంగా లేనని ఒప్పుకున్నట్టవుతుంది. నిజానికి లతా గొప్ప అందగత్తె కాకపోవవచ్చు కానీ ఓ రకమైన ఛార్మ్‌ ఉంటుంది ఆమె మొహంలో. రాజకపూర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో లతా ఎలా ఏకీభవించగలదు?

నిజానికి సత్యం శివం సుందరం సినిమాను రాజ్‌కపూర్‌ ఎప్పుడో తీయాల్సింది. 1954లోనే ఈ కథ రూపుదిద్దుకుంది. ఓ సాధారణ అమ్మాయి. ఆమెను ఎవరూ పట్టించుకోరు. కానీ ఆమెలో అద్భుతమైన గాయని ఉంటుంది. ఆ సమ్మెహన గాత్రం విని అందరూ ఆమె వెంటపడతారు. స్థూలంగా ఇదీ కథ. తను హీరోగా, లతా మంగేష్కర్‌ హీరోయిన్‌గా సినిమా తీద్దామనుకున్నాడు రాజ్‌కపూర్‌. లతా కూడా ఓకే చెప్పింది. ఇద్దరూ కలిసి కథా చర్చల్లో పాల్గొన్నారు. ఎందుకో కానీ స్క్రిప్ట్‌ రాజకపూర్‌కు అంతగా నచ్చలేదు. అలా ఆ సినిమా ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఆ స్క్రిప్ట్‌ను వెలికి తీశాడు రాజ్‌కపూర్‌. అప్పటికే తను హీరో పాత్రలు వదిలేసి చాలా కాలం అయ్యింది. అందుకే తన తమ్ముడు శశికపూర్‌తో సినిమా ప్లాన్‌ చేశాడు. మీరోయిన్‌గా జీనత్‌ అమన్‌ను తీసుకున్నాడు. అరకొర దుస్తులతో జీనత్‌ అమన్‌ స్టిల్స్‌ చూసి జనం నిర్ఘాంతపోయారు. ఇలాంటి సినిమాకు ప్రేరణ తానేనని లతా మంగేష్కర్‌ మాత్రం ఎలా ఒప్పుకుంటుంది? ఆ మాటకొస్తే ఎవరూ అంగీకరించరు. రికార్డింగ్‌కు లతా రాకపోయేసరికి రాజ్‌కపూర్‌ జడుసుకున్నాడు. అయ్యో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారనీ, ఇన్‌స్పిరేషన్‌ లతా కాదని, ఆమె గొంత మాత్రమేనని మళ్లీ ఓ ప్రకటన చేశాడు రాజ్‌కపూర్‌. అయినప్పటికీ లతా కరగలేదు. ఇక లాభం లేదనుకుని పాటను హేమలతతో పాడించాడు. లతా కోపం చల్లారిన తర్వాత మళ్లీ పాడించుకోవచ్చులేనని అనుకున్నాడు. అయితే ఆ అవసరం రాలేదు. ఎందుకంటే సినిమాలో ఆ పాట అవసరం పడలేదు.

Also Read: Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)

Manchu Vishnu: ‘సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఆయన పర్సనల్’.. మంచు విష్ణు సంచలన కామెంట్స్

Samantha: ‘అలా ఉంటే మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి’.. సమంత ఇంట్రస్టింగ్ పోస్ట్