నాకు మొదట పెట్టిన పేరు వేరే.. NTR అని మార్చింది తాతగారే..
జూ. ఎన్టీఆర్ తన తాతగారు, దివంగత నందమూరి తారక రామారావు గారితో గడిపిన మరచిపోలేని క్షణాలను పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా తన పేరును తారక్ రామ్ నుంచి నందమూరి తారక రామారావుగా మార్చారని, తనను తన వారసుడిగా తీర్చిదిద్దాలని తల్లికి చెప్పిన మాటలను భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు. ఆశీర్వాదంతో కూడిన ఆ అనుబంధం తన జీవితాన్ని మలుపు తిప్పిందని తెలిపారు.

నందమూరి తారక రామారావు జూనియర్ (జూ. ఎన్టీఆర్) తన తాతగారు, దివంగత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (సీనియర్ ఎన్టీఆర్)తో తనకున్న అమూల్యమైన అనుబంధాన్ని, తన పేరు మార్పు వెనుక ఉన్న చారిత్రక ఘట్టాన్ని ఓ ఇంటర్క్యూలో వివరించారు. ఓ ఉదయం తాను సీనియర్ ఎన్టీఆర్ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ వాతావరణం, అక్కడి దైవత్వం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, గుడిలో ఉన్న అనుభూతి కలిగిందని తెలిపారు. కాషాయ వస్త్రాల్లో కూర్చుని ఉన్న తాతగారు తనను “ఏమిటి మీ పేరు?” అని అడిగారని, తాను తారక్ రామ్ అని బదులిచ్చానని చెప్పారు. తన నాయనమ్మ బసవరామ తారకం పేరుతో కలిసి ఉంటుందని తారక్ రామ్ అని పెట్టారని వివరించారు. అయితే, సీనియర్ ఎన్టీఆర్ వెంటనే తన తండ్రి హరికృష్ణను పిలిచి, “ఈ అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావుగా మార్చండి” అని ఆదేశించారని తెలిపారు. ఆ క్షణం నుంచి తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని జూ. ఎన్టీఆర్ పేర్కొన్నారు. పేరు మార్పుతో మొదలైన ఈ అనుబంధం ఒక సంవత్సరం పాటు కొనసాగిందని, తాతగారు తనను బంగారంలా చూసుకున్నారని భావోద్వేగంగా పంచుకున్నారు. ఈ అనుబంధం అపురూపమైనదని, ఆ సమయంలో తాను, తాతగారు మాత్రమే ఉండేవారని, మూడో వ్యక్తికి తావులేదని వివరించారు.
బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తాతగారే తనను భరతుడిగా వేషం వేయించి, అరకు తీసుకెళ్లారని తెలిపారు. అదే సినిమాకు ఆయనే దర్శకుడని, డబ్బింగ్ సమయంలో తాతగారే థియేటర్లో కూర్చుని తనతో డబ్బింగ్ చెప్పించారని గుర్తుచేసుకున్నారు. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తాతగారు నాన్-వెజిటేరియన్ తినేవారు కాదని, సాయంత్రం 5:30 కల్లా భోజనం చేసి 7:00 గంటలకు నిద్రపోయేవారని, అయితే తనకు నాన్-వెజ్ లేకుండా ముద్ద దిగదని తెలిపారు. దీంతో రాత్రి 8:30 గంటలకు ఒక సహాయకుడు నాన్-వెజ్ భోజనం తీసుకొచ్చేవారని, అప్పటి వరకు నిద్రపోయినట్లు నటిస్తూ, భోజనం రాగానే తాతగారు లేచి పక్కన తాను తినేవరకు కూర్చునేవారని జూ. ఎన్టీఆర్ తెలిపారు. ఉదయాన్నే తాతగారికి మసాజ్ చేసిన తర్వాత, తనను కూడా తీసుకెళ్లి మీగడ స్నానం చేయించేవారని చెప్పారు. తర్వాత తన తల్లి వండిన నాన్-వెజ్ వంటకాలు తాతగారికి నచ్చడంతో, నిత్యం తన తల్లి నుంచే క్యారేజీ వెళ్ళేదని, ఆ తర్వాత తన తల్లిని తాతగారు పిలిపించారని వివరించారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తన తల్లితో “ఎంత కాలం దూరం ఉన్నామో పట్టించుకోకండి. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటి వాడిగా అతన్ని తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించమ్మ, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను” అని చెప్పారని గుర్తుచేసుకున్నారు. తాతగారు చనిపోయినప్పుడు ఈ మాటలపై తనకు కోపం వచ్చిందని, అనాథగా వదిలేసి వెళ్ళిపోయారని బాధపడినట్లు తెలిపారు. కానీ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత ఆయన మాటల అర్థం తెలుస్తోందని, “ఎన్టీఆర్” అనే మూడు అక్షరాలు, తన పోలికలు ఇచ్చి ఆయన తన బాధ్యతను నిర్వర్తించారని, ఇప్పుడు తన వంతు బాధ్యతను తాను నిర్వర్తించుకోవాలని జూ. ఎన్టీఆర్ భావోద్వేగంగా ముగించారు.
