Anasuya Bharadwaj: అనసూయను సోషల్ మీడియాలో వేధించింది ఇతనే.. అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

ఇటీవల సినిమా తారలపై సోషల్ మీడియా వేధింపులు ఎక్కువైపోయాయి. కొందరు పని గట్టుకుని మరీ సినిమా తారలను టార్గెట్ చేసుకుని అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ గురువుతున్న వారిలో నటి, స్టార్ యాంకర్ అనసూయ ఒకరు.

Anasuya Bharadwaj: అనసూయను సోషల్ మీడియాలో వేధించింది ఇతనే.. అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
Anasuya Bharadwaj

Updated on: Mar 14, 2026 | 7:12 AM

టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం (మార్చి13) అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని కడప జిల్లా పులివెందుల పరిధిలోని జూటూర్‌ గ్రామానికి చెందిన జనార్దన్‌ నగరానికి వచ్చి గచ్చిబౌలి ఇంద్రానగర్‌లో ఉంటున్నాడు.అనసూయను టార్గెట్ చేసుకుని ఏఐ ద్వారా రూపొందించిన నకిలీ వీడియో, అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన పోస్టులను ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు వివిధ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నాడు. తన సోషల్ మీడియా ఖాతాలకు ఎక్కువ వ్యూస్, ఫాలోవర్లు రావాలనే ఉద్దేశంతో జనార్దన్ ఈ చర్యలకు పాల్పడినట్లు సమాచారం. అనసూయకు సంబంధించిన ఫోటోలు.. వీడియోలను జనార్దన్ మార్ఫింగ్ చేసి, వాటిని అసభ్యకరంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె గురించి అనుచిత వ్యాఖ్యలు కూడా పెట్టి, ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

దీనిపై నటి అనసూయ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అతడిని కడపలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో జనార్దన్ తన నేరాలను ఒప్పుకున్నట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, ఫాలోయింగ్, పేరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నట్లు జనార్దన్ చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జనార్దన్ ను మరింత విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో ఎవరికైనా నష్టం కలిగించేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు అరెస్ట్ చేసిన జనార్దన్ ఇతనే..

Anasuya Bharadwaj 1

మరో కేసులో ఓ సినీనటి పోస్టు చేసిన యూట్యూబ్‌ రీల్స్‌ను చూసి అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్టు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్‌ మారేడ్‌పల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ అరుణ్‌ కుమార్‌.. ఓ సినీనటి పోస్టుచేసిన రీల్స్‌ను తిలకించాక ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగేలా అసభ్యకర వ్యాఖ్యలు పోస్టు చేశాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us