
సినిమా నిర్మాతలను, హీరోకు నచ్చేలా కథ రాయాలి. వారిని ఏ విధంగా చూపించాలనుకుంటున్నారో చెప్పాలి. అదే విధంగా సినిమాను తెరకెక్కిస్తారనే నమ్మకం కలిగించాలి. అక్కడే దర్శకుడు ముందుగా సక్సెస్ కావాలి. వీటన్నింటినీ దాటుకుంటూ ముందడుగు పడితేనే సినిమా మొదలయ్యేది.
న్యూఇయర్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్బాబు నటించి ఆయనను నటుడిగా నిలబెట్టిన సినిమా మురారి. ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా అందులో ఉండే కథాంశం యదార్థాలకు దగ్గరగా అనిపిస్తుంది. అందుకే ఆ సినిమాను మహేష్ అభిమానులతోపాటు సినీ ప్రేమికులు కూడా బాగా ఆదరించారు. తెలుగు సినిమా చరిత్రలో ‘మురారి’ ఒక మలుపు. మహేష్ బాబును కేవలం గ్లామర్ హీరోగానే కాకుండా ఒక గొప్ప నటుడిగా నిలబెట్టిన చిత్రమిది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా కథను మొదట విన్నప్పుడు మహేష్ బాబు, కృష్ణ ఇద్దరూ తిరస్కరించారు. అవును, ఇది నమ్మశక్యం కాకపోయినా నిజం.
ఎంతో రీసెర్చ్ చేసి కృష్ణవంశీ ఈ కథ రాసుకున్నారు. ఇందిరా గాంధీ కుటుంబంలోని మరణాలు, కృష్ణా జిల్లాలోని ఒక కుటుంబంలో జరిగిన వరుస చావులు చూసి ఈ శాపం అనే పాయింట్ తీసుకున్నారు. ఈ కథ విన్నప్పుడు కృష్ణకు అందులోని సీరియస్ నెస్ నచ్చినా, సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనే చిన్న అనుమానం ఉండేది. అందుకే ఆయన క్లియర్ గా “మహేష్ నే అడగండి” అని బంతిని మహేష్ కోర్టులోకి వేశారు. మహేష్ బాబుకు అప్పట్లో ఉన్న ఇమేజ్ కి ఈ శాపం, చావు, దైవత్వం వంటి అంశాలు ఉన్న కథ రిస్క్ అనిపించింది. అందుకే ఆయన సున్నితంగా నో చెప్పారు.
Murari Poster And Krishnavamsi
నిర్మాత రామలింగేశ్వరరావు కూడా కృష్ణవంశీ మీద నమ్మకం ఉన్నా, కథ విని తెల్లమొహం వేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నాయని భయపడ్డారు. ఈ క్రమంలోనే మహేష్ కోసం కృష్ణవంశీ మరొక కమర్షియల్ కథ రాసినా, ఆయన మనసు మాత్రం మురారి మీదనే ఉంది. “నన్ను నమ్మండి, కొన్ని తరాల పాటు గుర్తుండిపోయే సినిమా ఇస్తాను” అని కృష్ణవంశీ గట్టిగా ప్రామిస్ చేయడంతో మహేష్ బాబు ఓకే చెప్పారు.
ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. మణిశర్మ సంగీతం, సోనాలి బింద్రే అందం, మహేష్ నటన వెరసి ‘మురారి’ ఒక ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఒకవేళ ఆ రోజు కృష్ణవంశీ తన కథ మీద అంత నమ్మకంతో లేకపోయి ఉంటే, ఈ క్లాసిక్ మనకు దక్కేది కాదు. మహేష్ పుట్టినరోజు సందర్భంగా రీరిలీజ్ అయ్యి కలెక్షన్ల రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా 2025 డిసెంబర్ 31న థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నారు. ఆ మేజిక్ ను మళ్ళీ వెండితెరపై చూడటానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.