
హైదరాబాద్లో ఇప్పుడు నీటికి ఎంత కటకట ఉందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా అపార్ట్మెంట్స్, విల్లాలకు నిత్యం ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ఈ నీటి కొరతల మధ్య సినిమా షూటింగ్ కోసం భారీగా ట్యాంకర్ల నీరు కోరడం వివాదంగా మారింది. మహేష్బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఎస్.ఎస్. రాజమౌళి కొత్త చిత్రం ‘వారణాసి’ కోసం 150 ట్యాంకర్ల నీటి సరఫరా రిక్వెస్ట్ను హైదరాబాద్ వాటర్ బోర్డు(HMWS&SB) తిరస్కరించింది.
రాజేంద్రనగర్ పరిధిలోని గగన్పహాడ్లో ఏర్పాటు చేసిన స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో భాగంగా నీటిలో తీసే కొన్ని సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఒక కుంటను నిర్మించినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీ దుర్గా ఆర్ట్స్ ప్రతినిధులు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీని సంప్రదించి, ఒక్కోటి 10 వేల లీటర్ల సామర్థ్యం గల 150 ట్యాంకర్ల నీరు కావాలని విజ్ఞప్తి చేశారు. రవాణా ఖర్చులను కూడా భరిస్తామని పేర్కొన్నారు.
ఈ నెల 18న షూటింగ్ నిర్వహించాల్సి ఉండటంతో, శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని కోరినట్లు సమాచారం. అయితే నగరంలో ఇప్పటికే నీటి సమస్యలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, అంత పెద్ద మొత్తంలో నీటిని సినిమా అవసరాల కోసం కేటాయించడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ అంశంపై బోర్డు ఎండీ అశోక్రెడ్డి సహా ట్యాంకర్ విభాగాధికారులు స్పందించలేదు. ఒకవైపు ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు సినిమా షూటింగ్ల కోసం భారీగా నీటి వినియోగంపై చర్చలు మొదలయ్యాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.