
2008 లో రిలీజైన అష్టాచమ్మా సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ ఫన్ లవ్ స్టోరీలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించాడు. అలాగే కలర్స్ స్వాతి కథానాయిక. మరో జోడీగా శ్రీనివాస్ అవసరాలు, భార్గవి జంటగా నటించారు. నాని, స్వాతిల యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరూ తమదైన నటనతో అదరగొట్టారు. కానీ వీరి మధ్యలోనూ సెకెండ్ హీరోయిన్ గా చేసిన భార్గవి కూడా తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో ఆడియెన్స్ మనసులు కొల్లగొట్టింది. నానికి సోదరిగా, శ్రీనివాస్ అవసరాలకు లవర్ గ ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అష్టాచమ్మా కంటే ముందు పలు సినిమాల్లో నటించింది భార్గవి. 2006లో రామ్, ఇలియానా పరిచయమైన సినిమాతోనే ఈ అమ్మడు కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. అందులో కాలేజీ అమ్మాయిగా ఓ చిన్న పాత్రలో కనిపించింది. దేవదాసు తర్వాత మా ఊరి వంట, అమ్మమ్మ .కాం, అమృతం వంటి టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ లోనూ యాక్ట్ చేసింది భార్గవ. అలాగే అన్నవరం, రక్షా, హాలిడేస్ ,అంజనీ పుత్రుడు, మిస్టర్ మేధావి, పాండురంగడు తదితర చిత్రాల్లోనూ కనిపించింది. తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైందీ అందాల తార. భార్గవిని చూసి టాలీవుడ్ కు మరో మంచి తెలుగు హీరోయిన్ దొరికిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ విధి మరోలా తలచింది.
సినిమా కెరీర్ సాఫీగా సాగుతున్న క్రమంలోనే భార్గవి అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది. 2008 డిసెంబర్ 16న హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన స్వగృహంలో శవంగా కనిపించిందీ అందాల తార. ఆమెతో పాటు ప్రవీణ్ అనే వ్యక్తి కూడా అక్కడే చనిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ జంట మరణాలపై అప్పట్లో టాలీవుడ్ తో పాటు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై ఎన్నో వదంతులు, అనుమానాలు తలెత్తాయి. ఈ భార్గవి, ప్రవీణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, అయితే ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే భార్గవిని ప్రవీణ్ హత్య చేశాడని, ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనా ప్రవీణ్ ను నమ్మి భార్గవి తన జీవితాన్ని నాశనం చేసుకుందని, ఆమె మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక మంచి నటిని కోల్పోయిందన్న అభిప్రాయాలు వినిపించాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.