
నటుడు అరుంధతి అరవింద్, ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ, వ్యక్తిగత జీవితం, పాన్ ఇండియా సినిమాల ట్రెండ్పై తన ఆలోచనలను పంచుకున్నారు. బయటి ప్రపంచం నటీనటుల జీవితాన్ని చాలా విలాసవంతంగా ఊహించుకుంటుందని, భారీ రెమ్యూనరేషన్, ఆస్తులు ఉంటాయని అనుకుంటుందని, కానీ చాలావరకు సంపాదన నిర్వహణ ఖర్చులకే సరిపోతుందని ఆయన వివరించారు. సినిమాలు లేని సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, గతంలో చేసిన పొదుపు, బంగారం వంటివి ఆదుకున్నాయని తెలిపారు. జీవితాన్ని సాధ్యమైనంత విలాసవంతంగా గడపాలని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్పై అరవింద్ మాట్లాడుతూ.. మహేష్ బాబు బాలీవుడ్ కాంట్ అఫర్డ్ మీ వ్యాఖ్యపై వచ్చిన విమర్శలను ప్రస్తావించారు. హిందీ నటుడు రాహుల్ దేవ్, మహేష్ బాబుకు హిందీ రాదు కాబట్టే అలా అన్నారని వ్యాఖ్యానించినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమ హిందీ నటులకు అవకాశాలు ఇచ్చి, వారి జీవితాలను స్థిరపరుస్తున్నప్పుడు, తెలుగు హీరోపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. తెలుగులో మాట్లాడటం రాకపోయినా, ప్రాంప్ట్ చూసి డబ్బింగ్ చెప్పించుకుంటూ ఇక్కడ ఎందరో హిందీ నటులు పని చేస్తున్నారని గుర్తు చేశారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ పెరిగిందని, అన్ని సినిమాలు పాన్ ఇండియా కోవలోకి రావని ఆయన స్పష్టం చేశారు. బాహుబలి, RRR, పుష్ప, కాంతార, KGF వంటి చిత్రాలు మాత్రమే నిజమైన పాన్ ఇండియా విజయాలను సాధించాయని, మిగిలినవి కేవలం ఐదు భాషల్లో విడుదలైనంత మాత్రాన పాన్ ఇండియా కావని ఆయన అన్నారు.
చాలా పాన్ ఇండియా చిత్రాలు నార్త్లో అతి తక్కువ కలెక్షన్లు సాధించాయని అన్నారు అరవింద్. కమల్ హాసన్ పుష్పక విమానం, మంజుమ్మల్ బాయ్స్ వంటి చిత్రాలు భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో స్థానిక నటీనటులకు అవకాశాలు కల్పించాలని అరవింద్ కోరారు. ఇతర భాషల నటులకు భారీ సౌకర్యాలు కల్పిస్తూ, వారికి లైఫ్ ఇస్తున్నామని, కానీ అదే ఇతర పరిశ్రమలు తెలుగు నటులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సునీల్ వంటి నటులు పుష్ప తర్వాతే ఇతర భాషల్లోకి వెళ్లగలిగారని గుర్తు చేశారు. తాను ఏ పాత్రకైనా పరిమితం కాలేదని, విలన్, కామెడీ, సెంటిమెంట్, ఫ్రెండ్ వంటి అనేక రకాల పాత్రలను పూర్తి సంతృప్తితో పోషించానని తెలిపారు అరవింద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.