Hero Nani: ‘డబ్బుపై ఆశతోనే..’ నాని కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణు..

|

Dec 23, 2021 | 4:39 PM

సినిమా అంటే వినోదం.. కానీ ఇప్పుడు ఏపీలో వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టికెట్ రేట్లపై అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీకి మధ్య డ్రమేటిక్ సీన్స్ నడుస్తున్నాయి.

Hero Nani: డబ్బుపై ఆశతోనే.. నాని కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణు..
హీరో నానిపై వైసీపీ నేతలు ఫైర్
Follow us on

సినిమా అంటే వినోదం.. కానీ ఇప్పుడు ఏపీలో వివాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. టికెట్ రేట్లపై అటు ప్రభుత్వం, ఇటు ఇండస్ట్రీకి మధ్య డ్రమేటిక్ సీన్స్ నడుస్తున్నాయి. ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ విధానంతో పాటు.. ఏరియాలను బట్టి థియేటర్ టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ రూల్స్ పాటించని థియేటర్లపైన చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హీరో నాని ఈ వివాదంపై స్పందించారు. బడ్డీ కొట్టు కంటే థియేటర్ కౌంటర్లో కలెక్షన్ తక్కువగా ఉంటోంది. ఇలా అయితే ఇండస్ట్రీ బతకడం కష్టమనేది నాని ఆవేదన. అయితే ప్రతి దానికీ ఎమ్మార్పీ ఉంటుంది కాబట్టే టికెట్లకి కూడా లిమిట్స్ పెట్టామన్నది ప్రభుత్వ వాదన. ఎక్కువ రేటు ఉన్నా టికెట్ కొనే సామర్ధ్యం ప్రేక్షకులకు ఉందని నాని అంటుంటే.. లేదు లేదు.. ప్రజలకు సినిమాను అందుబాటులోకి తెచ్చేందుకే రేట్లపై లిమిట్స్ పెట్టామని ప్రభుత్వం అంటోంది. అంతే కాదు నానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి బొత్స.

నాని మాత్రమే కాదు.. హీరో పవన కళ్యాణ్.. RRR ప్రొడ్యూసర్ దానయ్య కూడా ఏపీ టికెటింగ్ విధానంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ తీరుతో సినిమా తీవ్ర నష్టాల్లోకి పోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చిన్న సినిమానీ, పెద్ద సినిమానీ ఒకేలా చూడటం కరెక్ట్ కాదనేది పలువురు సినీ పెద్దల వాదన.

“సినిమా టికెట్లు విక్రయంలో ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎవరికైనా, ఏమైనా ఇబ్బందులు ఉంటే, వారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోవాలి. అలా కాకుండా, మా ఇష్టారాజ్యంగా చేసుకుంటామంటే కుదరదు. ఎంఆర్పీ అనేది ఈరోజు ప్రతి వస్తువుకీ ఉంటుంది. ఎంఆర్పీ లేకుండా భారతదేశంలో ఏ వస్తువు అయినా అమ్ముతున్నామా..? దేనికైనా ఎంఆర్పీ అన్నది ఉండాలి, అలాంటిది సినిమా టికెట్లకు ఉండకూడదా..? ఇదెక్కడి న్యాయం…?.. మీ ఇష్టం వచ్చినట్లు రెండు రెట్లు, మూడు రెట్లు అధికంగా టికెట్ ధరలు పెంచి, బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకుంటామంటే కుదరదు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు” అని మంత్రి బొత్స పేర్కొన్నారు.

నాని కామెంట్స్‌పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా రెస్పాండ్ అయ్యారు. “నాని మాట్లాడింది తప్పు. సినిమా టికెట్ల ధరలు తగ్గించడం నానికి నచ్చలేదు. నానికి డబ్బులు ఎక్కువ రావాలి.. రేట్లు పెరగాలి.. సంపాదించాలని అని కోరిక ఉంది. సంపాదనే ప్రధాన ధ్యేయంగా నాని మాట్లాడారు. దాన్ని మేం పరిగణనలోకి తీసుకోము. ప్రజలకు మేలు కలిగే నిర్ణయమే ప్రభుత్వం తీసుకుంది.  నానికి ఏమైనా మాకు ప్రత్యర్థా..? అతను అలా ఊహించుకుంటున్నాడేమో.,  లెక్కల ఏమైనా తేల్చుకోవాలంటే ఎక్కడైనా ఎప్పుడైనా తేల్చుకుంటాం. మా పార్టీని, నాయకుడిని, ప్రభుత్వాన్ని, ఎదుర్కొన్న వాళ్ళు ఏమయ్యారో చూసాం.  సినిమా టికెట్ల ధరలు తగ్గితే ప్రేక్షకులకు మంచే జరుగుతుంది. ప్రభుత్వంపై ఏదో మాట్లాడాలని మాట్లాడటం మంచిది కాదు. సినిమా థియేటర్లు, కిరాణా షాపులకి సంబంధం ఏంటి..?. గ్రామ మండల అర్బన్ స్థాయిలో ధరలు నిర్ణయించాం. అక్రమాలు, అన్యాయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందరితో చర్చలు జరిపిన తర్వాతే జీవో ఇచ్చాం” అని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

ఇప్పుడే కాదు.. గతంలోనూ థియేటర్లపై నాని తన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా అంటే కేవలం హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదనీ.. థియేటర్ వ్యవస్థను నమ్ముకుని లక్షలాది మంది కార్మికులు బతుకుతారని అన్నారు. నష్టాలు తప్పవని సినీ ప్రముఖులు అంటుంటే.. ఇష్టారీతిన అమ్ముకుంటారా.. అంటూ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. మరోవైపు జీవో నెంబర్ 35 కు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోంది. మరోవైపు సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ సినిమాలు తెరమీదకు రాబోతున్నాయి. మరి మల్టిపుల్ స్ర్కీన్ ప్లే కి క్లైమాక్స్ ఎలా ఉంటుంది.. ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!

National Farmer’s Day 2021: రైతుల జీవితాలపై సాంగ్.. మీ కళ్ళల్లో నీళ్ళు చెమ్మగిల్లుతాయ్