
దిగ్గజ నటుడు రఘువరన్, తెలుగు సినిమాతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన కళాకారుడు. శివ చిత్రంలో భవాని పాత్రతో ఆయన సంపాదించిన కల్ట్ స్టేటస్, ఆయన నటనకు ఒక మైలురాయి. కేరళలోని కొల్లంగుడైలో 1958 డిసెంబర్ 11న జన్మించినా, కోయంబత్తూరులో విద్యాభ్యాసం చేశారు. బీఏ సైకాలజీ పూర్తిచేసిన తర్వాత నటనపై ఆసక్తితో మద్రాస్లోని ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. తొలుత కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసినా, మలయాళంలో హరిహరన్ దర్శకత్వంలో వచ్చిన ఎలవత్తు మనిదన్ చిత్రంతో హీరోగా గుర్తింపు పొందారు. ఈ చిత్రం జాతీయ అవార్డు గెలుచుకుంది. రఘువరన్ కొంతకాలం హీరోగా నటించినా, విభిన్న పాత్రలు పోషించాలనే తపనతో విలన్గా మారాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం చిత్రంలో పోలియో వ్యాధిగ్రస్తుడైన విలన్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ పాత్ర ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.
రఘువరన్ కెరీర్లో అత్యంత కీలకమైన మలుపు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రం. ఈ సినిమాలో భవాని పాత్ర రఘువరన్ కు ఇవ్వడానికి వర్మ మొదట వెనుకాడినా, నాగార్జున సపోర్టుతో ఆ పాత్ర రఘువరన్ కు దక్కింది. భవాని పాత్రలో రఘువరన్ నటన, ఆయన హావభావాలు, డైలాగ్ డెలివరీ సినిమాకే హైలైట్గా నిలిచాయి. విలనీకి సరికొత్త అర్థం చెప్పారు రఘువరన్. భయంకరమైన మేకప్లు, అరుపులకు బదులుగా, తేనె పూసిన కత్తిలాంటి ప్రతినాయకుడి పాత్రలను అలవోకగా పోషించి ఆకట్టుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో దాదాపు 25 చిత్రాల్లో కనిపించారు. విలన్ పాత్రలకే పరిమితం కాకుండా, సుస్వాగతంలో పవన్ కళ్యాణ్కు తండ్రిగా, అంజలిలో చిన్న పాపకు తండ్రిగా హృద్యమైన పాత్రలను పోషించి విమర్శకుల ప్రశంసలు పొందారు. రజనీకాంత్కు మంచి స్నేహితుడైన రఘువరన్, ఆయనతో అనేక చిత్రాల్లో నటించారు. బాషాలో ఆంటోనీ పాత్ర, ముత్తు, అరుణాచలం వంటి చిత్రాల్లో ఆయన నటనను ప్రజలు ఎంతగానో అభిమానించారు.
రఘువరన్ మాటలకు మధ్య కాస్త గ్యాప్ ఇచ్చి, స్పష్టంగా డైలాగ్ చెప్పే శైలి ఆయన ప్రత్యేకత. వ్యక్తిగత జీవితంలో కొన్ని చెడు అలవాట్లతో ఇబ్బందిపడిన రఘువరన్, నటి రోహిణి జీవితంలోకి వచ్చాక మారారు. వారి వివాహం 1996 ఆగస్టు 23న తిరుపతిలో రహస్యంగా జరిగింది. వారికి రిషివరన్ అనే కుమారుడు ఉన్నాడు. దురదృష్టవశాత్తు, 2004లో రోహిణి, రఘువరన్ విడిపోయారు. మళ్లీ మద్యానికి బానిస కావడం విడాకులకు ఒక కారణమని అంటారు. విడాకుల అనంతరం కర్ణాటకలోని ప్రకృతి ఆశ్రమంలో చికిత్స పొందారు. మద్యపాన బానిస వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో చెప్పే ఒరు మనిదనిన్ కథై అనే టీవీ సీరియల్ లో నటించారు. రఘువరన్ 2008 మార్చి 19న కన్నుమూశారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: వామ్మో.. ఇదేం క్రేజ్ రా బాబూ.. యూట్యూబ్ను షేక్ చేస్తున్న పక్కా ఫోక్ సాంగ్.. ఇన్ స్టాలో దుమ్మురేపుతున్న రీల్స్..
Raghuvaran. News
ఎక్కువ మంది చదివినవి : Sampath Raj : అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయా.. నటుడు సంపత్ రాజ్..