
న్యూఢిల్లీ, మే 24: నోయిడాకకు చెందిన చెందిన మోడల్, నటి అయిన ట్విషా శర్మ 2025 డిసెంబర్లో రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాల సింగ్ కుమారుడైన న్యాయవాది సమర్థ్ సింగ్తో వివాహం జరిగింది. వివాహం అనంతరం భోపాల్లోని కటారా హిల్స్లో కాపురం ఉన్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ మే 12న భోపాల్లోని అత్తవారింట్లో ట్విష ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి ఆమెకు పెళ్లై ఐదు నెలలే అవుతుంది. మృతి చెందడానికి ముందు తల్లి, స్నేహితులకు తాను వేధింపులకు గురవుతున్నానని, మానసిక క్షోభ అనుభవిస్తున్నానని ఫోన్ మెసేజ్లు పంపింది. మే 12న కటారా హిల్స్లోని తన అత్తగారి ఇంట్లో ట్విషా మృతదేహం లభ్యమైంది. ట్విష తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, అత్తమామలపై వరకట్నం వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించారని కేపు నమోదైంది. మరుసటి రోజే పోలీసులు ఈ కేసు దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు.
మరోవైపు న్యాయవాది అయిన సమర్థ్ భోపాల్లోని తన అత్తగారి ఇంట్లో ట్విషా మృతదేహం లభించిన మే 12వ తేదీ నుంచే పరారీలో ఉన్నాడు. ఈ కేసు మరింత ముదరడంతో ముఖ్యమంత్రిని కలవలేకపోయిన ట్విషా తల్లిదండ్రులు మే 17న ఆయన అధికారిక నివాసం బయట కొద్దిసేపు ధర్నా చేసింది. మే 18న భోపాల్లోని సెషన్స్ కోర్టు సమర్థ్ సింగ్ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. భోపాల్ పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసు జారీ చేసి రూ. 10,000 రివార్డును కూడా ప్రకటించారు. మే 19న పోలీసుల వక్రపూరిత దర్యాప్తును ప్రశ్నిస్తూ మృతురాలిపై మరణానంతర వ్యక్తిత్వ విచారణ జరుగుతోందని ఆరోపిస్తూ ఈ కేసుపై స్వతంత్ర విచారణ జరపాలని ట్విషా కుటుంబం డిమాండ్ చేసింది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఆ కుటుంబం ముఖ్యమంత్రిని కలవగా ఆయన సీబీఐ విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. అదే రోజు రెండవ పోస్ట్మార్టం పరీక్ష కోరుతూ దాఖలైన పిటిషన్ను భోపాల్ కోర్టు తిరస్కరించగా, సమర్థ్ సింగ్ అరెస్టు కోసం పోలీసులు రివార్డును రూ. 30,000కు పెంచారు. గిరిబాల సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి పోలీసులు తర్వాత మూడవ మరియు చివరి నోటీసు జారీ చేయగా సమర్థ్ సింగ్ కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేశారు. మే 22 (శుక్రవారం)న సమర్థ్ సింగ్ లొంగిపోవడానికి జిల్లా కోర్టుకు చేరుకోగా జబల్పూర్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జబల్పూర్ పోలీసులు అతడిని భోపాల్ పోలీసులకు అప్పగించగా వారు అతడిని కోర్టులో హాజరుపరిచారు. భార్య ట్విషా శర్మ ఆత్మహత్య కేసులో నిందితుడు సమర్థ్ సింగ్కు ఏడు రోజుల పోలీసు రిమాండ్కు పంపారు. శనివారం భోపాల్లోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అనుదిత గుప్తా కోర్టులో అతను హాజరవగా.. ఏమాత్రం పశ్చాత్తాపంలేని అతని ప్రశాంతమైన ప్రవర్తన చూపరులకు ఆశ్చర్యం కలిగించింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ట్విషా మృతదేహానికి రెండవ పోస్ట్మార్టం నిర్వహించేందుకు, ఎయిమ్స్ ఢిల్లీ నలుగురు సీనియర్ వైద్యులతో కూడిన ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరు ఈరోజు ప్రభుత్వ ప్రత్యేక విమానంలో భోపాల్కు బయలుదేరనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.