
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నాటి నుంచి బాలీవుడ్లో ప్రకంపనలు మొదలైన విషయం అందరికి తెలిసిందే. ఈ కేసు విచారణలో బాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ముందు సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి అరెస్టయిన తర్వాత డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటీమణులు, పలువురు సినీ ప్రముఖలను ఎన్సీబీ విచారించింది. ప్రముఖ బుల్లితెర కమెడియన్ భారతీ సింగ్, ఆమె భర్తను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు.
తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు నోటీసులు జారీ చేసింది. ఆయన 2019లో జూలైలో సెలబ్రిటీస్తో నిర్వహించిన పార్టీపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని కరణ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ పార్టీకి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. విచారణకు హాజరుకావాలని ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది ఎన్సీబీ. అలాగే నార్కోటిక్స్ బృందం ఇటీవల దర్యాప్తులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధా కపూర్ లను విచారించారు. వీరే కాకుండా క్వాన్ టాలెంట్ ఏజెన్సీ కి సంబంధించిన మధు మంతెన, కరిష్మా ప్రకాష్ , నిర్మాత క్షితిజ్ ప్రసాద్ తదితరులను విచారించారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో మరి కొంత మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.