
ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఖార్ వీధుల్లో ఒక ప్రశాంతమైన, విలాసవంతమైన లోకం ఆవిష్కృతమైంది. వెండితెరపై తన గ్లామర్తో మెప్పించే ఈ అందాల తార, ఇప్పుడు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ప్రముఖ రెస్టారెంట్ దిగ్గజం ధవల్ ఉదేశీతో చేతులు కలిపి, ఆమె తన కలల ప్రాజెక్ట్ ‘స్వీనీ’ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక రెస్టారెంట్ మాత్రమే కాదు, నగర జీవన అలసటను మర్చిపోయేలా చేసే ఒక పచ్చని ఒయాసిస్.
బ్రిటిష్ కాలం నాటి ‘కలోనియల్’ శైలికి, నేటి ఆధునిక ‘మోడరన్’ హంగులను జోడించడం ఈ రెస్టారెంట్ ప్రధాన థీమ్. దీనికి ప్రధాన ఆకర్షణ అక్కడ ఉన్న 140 ఏళ్ల నాటి భారీ మామిడి చెట్టు. రెస్టారెంట్లోని సగానికి పైగా అవుట్డోర్ ఏరియాకు ఈ మహావృక్షమే సహజమైన నీడను ఇస్తుంది. థాయ్ ఆర్కిటెక్చర్ నుంచి స్ఫూర్తి పొంది, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా దీనిని నిర్మించారు.
ప్రవేశ ద్వారం వద్ద మింట్-గ్రీన్ కలర్ తోరణం, ఆరెంజ్-వైట్ కాంబినేషన్ కార్పెట్ అతిథులకు గ్రాండ్ వెల్కమ్ చెబుతాయి. లోపల వెదురుతో చేసిన కుర్చీలు, నలుపు రంగు కుషన్లు వింటేజ్ లుక్ను ఇస్తాయి. గోడలకు ఉన్న పెద్ద పెద్ద గోల్డ్ ఫ్రేమ్ అద్దాలు చుట్టూ ఉన్న చెట్లను ప్రతిబింబిస్తూ, అదొక అనంతమైన తోటలా అనిపించేలా మాయ చేస్తాయి. లోపలికి వెళ్తే వాతావరణం మరింత హుందాగా మారుతుంది. వెదురు ఆకారంలో ఉండే తోరణాల మధ్య భారీ బ్యాక్లిట్ బార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది నలుపు-తెలుపు మార్బుల్తో రాజసం ఉట్టిపడేలా ఉంటుంది. ఆకుల ఆకారంలో ఉండే ఫ్రోస్టెడ్ గ్లాస్ షాన్డిలియర్లు హోటల్కు ఒక వెచ్చని, ఆహ్లాదకరమైన వెలుగును పంచుతాయి.
“థాయ్, యూరోపియన్ హోమ్-స్టైల్ వంటకాలు నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టమే ఈ రెస్టారెంట్ స్థాపనకు పునాది” అని ఈ స్టార్ బ్యూటీ పేర్కొన్నారు. గోడలకు వేసే రంగు విషయంలో కూడా ఆమె రాజీ పడలేదు. తనకు నచ్చిన ‘సేజ్ గ్రీన్’ రంగు పర్ఫెక్ట్గా వచ్చే వరకు ఏకంగా ఆరుసార్లు పెయింటింగ్ మార్పించారంటే ఆమెకు ఈ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ముంబై రద్దీలో కాసేపు ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ‘స్వీనీ’ ఒక కేరాఫ్ అడ్రస్గా మారింది. మలైకా అరోరా అభిరుచికి, వ్యాపార దక్షతకు ఈ రెస్టారెంట్ ఒక నిలువెత్తు నిదర్శనం.