SASIKALA POLITICS: ఇక రంగంలోకి చిన్నమ్మ… అన్నా డిఎంకే సారథ్యానికి పావులు కదుపుతున్న శశికళ?

|

May 03, 2021 | 6:43 PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో వున్న అన్నా డిఎంకే పరాజయాన్ని ముందే ఊహించి..

SASIKALA POLITICS: ఇక రంగంలోకి చిన్నమ్మ... అన్నా డిఎంకే సారథ్యానికి పావులు కదుపుతున్న శశికళ?
Follow us on

SASIKALA POLITICS IN TAMILNADU AGAIN: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (TAMILNADU ASSEMBLY ELECTION RESULTS) వెలువడిన వెంటనే ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలకు, భవిష్యత్ వ్యూహాలకు తెరలేచినట్లు తమిళ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో వున్న అన్నా డిఎంకే (ANNA DMK) పరాజయాన్ని ముందే ఊహించి.. కొందరు ఢిల్లీ పెద్దల సలహా మేరకు రాజకీయ సన్యాసం తీసుకున్న చిన్నమ్మ అలియాస్ శశికళ (SASIKALA) తిరిగి పాచికలు కదపడం అప్పుడే ప్రారంభించినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో (TAMIL POLITICAL CIRCLE) పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. జయలలిత (JAYALALITA) మరణానంతరం పార్టీపై పట్టు సాధించినా.. కాలం కలిసి రాక జైలు పాలైన శశికళ… రాంగ్ టైమ్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. అన్నా డిఎంకేపై పట్టు సాధించే సమయం లేకుండానే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల (TAMILNADU ASSEMBLY ELECTIONS) నగారా మోగింది. దానికి తోడు చిన్నమ్మ పెద్దరికాన్ని ఏ మాత్రం ఇష్టపడని ఫళనిస్వామి (PALANISWAMY), పన్నీరుసెల్వం (PANNIR SELVAM).. అధికారంలో వుండడంతో చిన్నమ్మ వ్యూహాలు అమలు పరచడం అంత ఈజీ కాలేదు. దానికి తోడు తనని పదే పదే నిలువరిస్తున్న ఢిల్లీ పెద్దలు కూడా ప్రతికూలంగానే వున్నారు. దాంత చేసేదేమీ లేక ఫ్యూచర్‌లో చూసుకుందామనుకుందో ఏమో ఫిబ్రవరిలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు శశికళ.

ఇదంతా గతం… రెండు నెలల కాలం గిర్రున తిరిగింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో తమిళనాడు (TAMILNADU) ఎన్నికల ప్రచారంతో హోరెత్తిపోయింది. కొత్తగా రాజకీయ అవతారమెత్తిన కొందరు సినీ నటులతో కలిసి.. తమిళనాడు ఎన్నికల ప్రచారం (TAMILNADU ELECTION CAMPAIGN) ఆద్యంతం రక్తి కట్టింది. ఏదైతేనేం పదేళ్ళుగా అధికారానికి దూరమైన ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకే) పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 234 మంది సభ్యులు గల తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY)లో ఏకంగా 160 సీట్లను డిఎంకే (DMK) పార్టీ గెలుచుకుంది. దాంతో పద్నాలుగేళ్ళ ప్రాయంలో కన్న కలను నెరవేర్చుకోవడం ద్వారా 68 ఏళ్ళ ఎంకే స్టాలిన్ (MK STALIN) తమిళనాడు ముఖ్యమంత్రి (TAMILNADU CHIEF MINISTER)గా మే నెల 7వ తేదీన పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇటు జయలలిత మరణంతో అదృష్టం కొద్ది దక్కిన ముఖ్యమంత్రి (CHIEF MINISTER) పీఠాన్ని కాపాడుకోవడంలో సిట్టింగ్ సీఎం ఫళని స్వామి విఫలమయ్యారు. పన్నీరు సెల్వంతో కలిసి తిరిగి అధికారంలోకి రావడానికి యధాశక్తి ప్రయత్నించారు ఫళనిస్వామి. కానీ.. ప్రభుత్వ వ్యతిరేకత, ద్రవిడులు అస్సలు సహించని బీజేపీతో దోస్తీ వెరసి పళని కలలకు షాక్ తగిలింది. అయితే.. కారణాలేంటో గానీ.. తమిళనాడులో బీజేపీ (BJP) అయిదు సీట్లను సాధించుకోగలిగింది.

ఇదంతా ఫలితాలు వెల్లడైన తర్వాత తెరమీద జరుగుతున్న కథ. కానీ తెరచాటు పరిణామాలు కూడా వేగవంతమైనట్లు తాజాగా తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ (TAMILNADU ASSEMBLY) ఎన్నికలకు ముందు అనూహ్యంగా రాజకీయ సన్యాసాన్ని ప్రకటించిన శశికళ (చిన్నమ్మ)  తెరచాటు రాజకీయాలను మాత్రం కొనసాగిస్తూనే వుంది. పేరుకే రాజకీయాలకు రామ్ రామ్.. కానీ రాజకీయాలపై మాత్రం అదే ఆసక్తి. కేవలం ఆసక్తే కాదు.. తెరచాటుగా రాజకీయ పావులు కూడా కదుపుతున్నారు శశికళ (SASIKALA). అస్త్ర సన్యాసం చేసిన తర్వాత పూర్తిగా ఆధ్యాత్మికంగా వుండిపోతున్నట్లు పైకి కనిపించినా.. తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. పరోక్షంగా అన్నా డిఎంకే (ANNA DMK) పార్టీపై పట్టుకు యత్నిస్తూనే వున్నారు. అన్నాడీఎంకేపై న్యాయస్థానంలో ఆమె సాగిస్తున్న ఆధిపత్య పోరు కొనసాగిస్తూనే వున్నారు. జయలలిత (JAYALALITA) జీవించి ఉన్నంత వరకు నీడలా ఆమె వెన్నంటి ఉండిన శశికళ ఆ తరువాత ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. అంతా జయను పోలినట్లుగా చీరకట్టు, నుదుటన బొట్టు, పాద నమస్కారాలు, ఆశీర్వచనాలతో ప్రారంభమైన చిన్నమ్మ వైభవం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునే వరకు సాగింది. ఆ తర్వాతే పరిస్థితులు మారిపోయాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది. నిజానికి ఈ కేసులో ఏ1 గా వున్న జయలలిత అప్పటికే మరణించడంతో ఏ2గా వున్న శశికళ ప్రధాన ముద్దాయి అయ్యారు. నాలుగేళ్ళ జైలు శిక్షకు వెసులుబాటు కల్పించుకునే అవకాశాలు ఏ మాత్రం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె జైలుకు వెళ్ళారు.

మరోవైపు అన్నా డిఎంకే నుంచి సస్పెండై వేరు కుంపటి పెట్టుకున్నాడు శశికళ అన్న కొడుకు టిటికే దినకరన్ (TTK DINAKARAN). ఆ పార్టీతో వుంటున్నట్లే వుంటే అన్నా డిఎంకేపై కన్నేశారు శశికళ. జైలు నుంచి విడుదలై అట్టహాసంగా చెన్నై చేరుకున్న శశికళ.. తనకు చక్రం తిప్పే సమయం లేకపోవడంతో  వ్యూహాత్మకంగా రాజకీయ సన్యాసం ప్రకటించిన చిన్నమ్మ.. తాజాగా ఫళనిస్వామి, పన్నీరు సెల్వంలకు వ్యతిరేకంగా వున్న అన్నా డిఎంకే నేతలకు సంకేతాలు పంపడం అప్పుడే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం బలంగా వుంటే భవిష్యత్తులో తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం వుంటుందని, బలహీన నాయకత్వం వుంటే.. స్టాలిన్ దూకుడు ముందు అన్నా డిఎంకే తుత్తునియలు కాకతప్పదని పలువురు అన్నా డిఎంకే నేతలు భావిస్తున్న నేపథ్యంలో చిన్నమ్మ లాంటి స్ట్రాంగ్ లీడరే తమకు కావాలని పలువురు కోరుకుంటున్నారు. తాజా ఎన్నికల్లో ఓటమికి సీఎం ఫళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వంలే కారణమని అప్పుడే పలువురు అన్నా డిఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఓటమిని కారణంగా చూపి.. చిన్నమ్మ వుంటేనే భవిష్యత్తు అనే రకంగా పార్టీలో తన అనుకూల వాదులతో మాట్లాడించడం ద్వారా తిరిగి పార్టీలోకి రావడమే కాదు.. అనతికాలంలోనే పార్టీపై గ్రిప్ సాధించేందుకు చిన్నమ్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.

డిఎంకే పార్టీకి ప్రత్యామ్నాయంగా అన్నా డిఎంకే మాత్రమే వుండాలంటే బలమైన నేతనే పార్టీకి సారథ్యం వహించాలని పలువురు ఏఐఏడిఎంకే వర్గాలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు తమిళ మీడియా రాస్తోంది. ఫళనిస్వామి, పన్నీరు సెల్వం పదవుల్లో వుండి బీజేపీకి దాసోహమయ్యారని, వారు ఆర్థికంగా బాగుపడడం మినహా పార్టీకి ఒరిగిందేమీ లేదని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ యత్నాలు సఫలమైతే.. పార్టీలో కీలకమైన నేతలు కొందరు ఆమె నాయకత్వానికి ఓకే చెప్పినా.. తమిళనాడులో శరవేగంగా పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. దానికి తోడు అన్నా డిఎంకే పార్టీపై పెత్తనం తనదేనంటూ కోర్టులో వేసిన పిటిషన్‌పై శశికళ ఇంకా తన వైఖరిని మార్చుకోలేదు. మే నెల మూడో వారంలో ఈ కేసు విచారణ వున్న నేపథ్యంలో స్ట్రాంగ్‌గా తిరిగి రంగ ప్రవేశం చేసేందుకు చిన్నమ్మ సమాయత్తం అవుతుందని తెలుస్తోంది. ఇదే జరిగితే.. చిన్నమ్మ సారథ్యంలో అన్నా డిఎంకే బౌన్స్ బ్యాక్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అప్పుడే జోస్యాలు ప్రారంభించారు.

ALSO READ: బెంగాల్ ఎన్నికల విశ్లేషణలో ఆసక్తికర అంశాలెన్నో… తృణమూల్ విజయం వెనుక మర్మమిదే?

ALSO READ: తృణమూల్ విజయం వెనుక శక్తి అతనే.. మేనత్తకు అండగా మేనల్లుడు

ALSO READ: ఐపీఎల్‌కు కరోనా షాక్… ప్రస్తుత సీజన్‌ను వాయిదా వేసే యోచనలో యాజమాన్యం!