Tamil Nadu Assembly Elections 2021: దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో ప్రచారం హోరెత్తుత్తోంది. ఈ క్రమంలో ప్రజలకు ఎన్నడూ తెలియని విషయాలు, వింతలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కూడా తమిళనాడులో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించి.. తమిళనాడు రాజకీయాల్లో వడివడిగా అడుగులేస్తున్నారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేతోపాటు.. తృతీయ ప్రత్యామ్నాయంగా కమల్ ఎన్నికల బరిలో దిగారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ కోయంబత్తూర్ (దక్షిణం) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్ సైతం దాఖలు చేశారు. ఈ అఫిడవిట్లో కమల్ తన స్థిర, చర ఆస్థుల వివరాలను వెల్లడించారు.
తనకు మొత్తం రూ.176.93 కోట్ల ఆస్తులున్నట్టు కమల్ హాసన్ పేర్కొన్నారు. అందులో స్థిరాస్తులు రూ. 131.84 కోట్లు.. కాగా చరాస్థులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. ఇక లండన్లో రూ.2.50 విలువ చేసే ఇల్లు.. రూ.2.7 కోట్ల లగ్జరీ కారు.. రూ. కోటి విలువైన బీఎండబ్యూ కారు ఉన్నట్టు కమల్ హాసన్ తెలిపారు. అంతేకాదు తనకు రూ.49.5 కోట్ల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. ఇక విద్యార్హత 8వ తరగతి చదువుకున్నట్టు కమల్ వెల్లడించారు.
2018 ఫిబ్రవరిలో కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే దశలో 234 స్థానాలకు ఎన్నికలకు జరగనున్నాయి. ఇప్పటికే అధికార అన్నాడీఎంకే – బీజేపీ, డీఎంకే-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. నాయకులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు.
Also Read: