Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు తొలివిడత నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి నామినేషన్లు షురూ!

|

Mar 20, 2024 | 9:47 AM

సార్వత్రిక ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం (మార్చి 20) తొలి దశ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్ 19వ తేదీన లోక్‌సభ తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం..

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలకు తొలివిడత నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి నామినేషన్లు షురూ!
Election Commission
Follow us on

న్యూఢిల్లీ, మార్చి 20: సార్వత్రిక ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం (మార్చి 20) తొలి దశ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్ 19వ తేదీన లోక్‌సభ తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో భాగంగా మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 లోక్‌సభ నియోజక వర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. దీంతో నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

బీహార్‌కు ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ మరియు నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి.. నియోజక వర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు మార్చి 27వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మార్చి 28న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. బీహార్‌కు మాత్రం మార్చి 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 30వ తేదీలోగా ఉపసంహరణకు గడువు ఉంటుంది.

తమిళనాడులోని 39, రాజస్థాన్‌లోని 12, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6 నియోజక వర్గాలకు మొదటి విడతలో పోలీంగ్‌ జరగనుంది. వీటితోపాటు మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, అస్సాంలలోని ఐదేసి, బిహార్‌లోని 4, పశ్చిమ బెంగాల్‌లోని 3, అరుణాచల్‌ ప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయల్లో రెండేసి, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌, జమ్మూ కశ్మీర్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరిల్లో ఒక్కో లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్‌ 19న తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మార్చి 16న ఎన్నికల సంఘం 2024 విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.