Haryana Election: హర్యానాలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు

|

Oct 03, 2024 | 11:37 PM

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు(అక్టోబర్ 3) సాయంత్రం 6 గంటలతో ముగిసింది. చివరి రోజు వరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి.

Haryana Election: హర్యానాలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు
Haryana Assembly Election 2024
Follow us on

హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజు(అక్టోబర్ 3) సాయంత్రం 6 గంటలతో ముగిసింది. చివరి రోజు వరకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. జాతీయ స్థాయి నేతలు ర్యాలీల్లో పాల్గొన్నారు. హర్యానాలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. జమ్మూకశ్మీర్ తరహాలోనే హర్యానాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఆగస్టు 16న ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ, అక్టోబర్ 1న హర్యానాలో ఒకే దశలో ఓటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, స్థానిక పార్టీలు, ప్రజల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల కమిషన్ ఓటింగ్, కౌంటింగ్ తేదీలను మార్చింది. రాష్ట్రంలోని 90 స్థానాలకు అక్టోబర్ 1న కాకుండా అక్టోబర్ 5న పోలింగ్ జరగుతోంది.

హర్యానాలో భారతీయ జనతా పార్టీ మరోసారి విజయం సాధించి, హ్యాట్రిక్ కొట్టాలని ఎన్నికల రంగంలోకి దిగింది. రెండు ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికారం పీఠం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక, JJP, ASP, BSP, INLD వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా, ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

రాష్ట్రంలో రెండు కోట్లకు పైగానే ఓట్లు నమోదయ్యాయి. హర్యానాలో ఎన్నికల కోసం 20,629 పోలింగ్ బూత్‌లను ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 101 మంది మహిళలు. బరిలో ఉన్న ప్రముఖ అభ్యర్థుల్లో సీఎం నాయిబ్ సింగ్ సైనీ (లద్వా), భూపేంద్ర సింగ్ హుడా (గర్హి సంప్లా-కిలోయ్), అభయ్ సింగ్ చౌతాలా (ఎల్నాబాద్), దుష్యంత్ చౌతాలా (ఉచన), అనిల్ విజ్ (అంబలా క్యాట్), ఓపీ ధంఖర్ (బద్లా), అనురాగ్ ధండా ( కలయత్), వినేష్ ఫోగట్ (జులానా). 2019 ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచి 31 సీట్లు సాధించింది.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనితీరు ఆధారంగా ఓట్లు కోరింది భారతీయ జనతా పార్టీ. అయితే రిజర్వేషన్లు, అవినీతి, బుజ్జగింపు, బంధుప్రీతిపై కాంగ్రెస్‌పై దాడి చేసింది. కాగా మహిళలు, యువత, రైతులు, పేదల సంక్షేమాన్ని రెండు రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో చేర్చారు. ప్రచారం చివరి రోజున, రాహుల్ గాంధీ, భూపేంద్ర హుడా కాంగ్రెస్ తరపున ప్రచారం చేయగా, బీజేపీ తరుఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, నయాబ్ సింగ్ సైనీ ర్యాలీలలో కనిపించారు. JJP తరుఫున దుష్యంత్ చౌతాలా, INLD నేత అభయ్ సింగ్ చౌతాలా వంటి ప్రముఖులు కూడా చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ తరపున ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలో మొత్తం నాలుగు ర్యాలీలు నిర్వహించారు.

హిమాచల్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చనందున కాంగ్రెస్ పార్టీ చెప్పే అబద్ధాలకు దూరంగా ఉండాలని బీజేపీ నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో, రాహుల్ గాంధీ తన ర్యాలీలలో గత సంవత్సరం చెలరేగిన హింస అంశాన్ని లేవనెత్తారు.ప్రధాని మోదీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఆరోపించారు. అలాగే నిరుద్యోగం, అగ్నివీరుడు, రైతుల సమస్యలను కూడా లేవనెత్తారు. మరోవైపు, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ కూడా హర్యానాలో ప్రచారం చేశారు. బీజేపీ తనను జైలుకు పంపి తన పనిని ఆపిందని ఆరోపించారు. హర్యానాలో తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదని కూడా ఆయన ప్రకటించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ హర్యానా ప్రజలకు ఏడు హామీలు ఇచ్చింది. రైతులకు మద్దతు ధర, మహిళలకు ప్రతి నెలా 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం కూడా వీటిలో ఉన్నాయి. అదే సమయంలో, బీజేపీ మహిళలకు నెలవారీ రూ.2100 ఆర్థిక సహాయం, రెండు లక్షల మంది యువతకు ఉపాధి, అగ్నివీర్‌కు ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలను ఇచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..