ముంబాయికి చెందిన ప్రముఖ టీవీ నటి సెజల్ శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమయ్యే ‘దిల్ తో హ్యాపీ హై జీ’లో సిమ్మీ ఖోస్లోగా గుర్తింపు పొందిన శర్మ.. శుక్రవారం తన గదిలో ఆత్మహత్య చేసుకుంది. తన జీవితంలో చోటుచేసుకున్న కొన్ని ఘటనలతో తీవ్ర మనస్తాపానికి గురైన సెజల్ శర్మ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని మీరా రోడ్లో రాయల్ నెస్ట్ సొసైటీలో ఉన్న తన ఫ్రెండ్ నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది సెజల్ శర్మ. తెల్లవారుజామున 2.30 గంటలకు షూటింగ్ నుంచి వచ్చి.. తన స్నేహితురాలు రూం తలుపు ఎంత కొట్టినా తీయకపోవడంతో అనుమానమొచ్చి.. పోలీసులకు ఫోన్ చేసింది.
వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రూం తలుపులు బద్దలకొట్టగా.. ఆమె చలనం లేకుండా పడి ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సెజల్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా.. నా చావుకు ఎవరూ కారణం కాదని, కొన్ని వ్యక్తిగత కారణాలతోనే నేను చనిపోతున్నా.. అంటూ సూసైడ్ నోట్ రాసింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్కి చెందిన సెజల్.. నటి కావాలన్న కోరిక 2017లో ముంబైకి వచ్చింది. తొలిసారిగా ఆమె స్టార్ ప్లస్ ఛానెల్లో ‘దిల్ తో హ్యాపీ హై జీ’ సీరియల్లో నటించింది. కాగా.. సెజల్ మృతికి పలువురు సహ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా.. సెజల్ అంత్యక్రియలు ఉదయ్ పూర్లో జరగనున్నాయి.