తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే ఇంట్లో ఆరుగురు మృతి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
తమిళనాడు విల్లుపురం సమీపంలోని తిండివనం దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో కారులోని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహకారంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతులు తిరునాల్వేలి జిల్లా థిసనాయ్విలయ్కు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారుగా గుర్తించారు. వారంతా కన్యాకుమారి నుంచి చెన్నైకు వెళ్తుండగా, గురువారం ఉదయం 6.00 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
తిండివనం-చెన్నై జాతీయ రహదారిపై పదిరి వద్దకు చేరుకునేసరికి వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున నిద్రమత్తు, అతివేగం కారణంగానే కారు అదుపుతప్పి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే ఆరుగురు మృతిచెందారని, చిన్నారులిద్దరూ తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు పేర్కొన్నారు. చిన్నారులను చికిత్స కోసం విల్లుపురం మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం కోసం తరలించారు.