Andhra News: పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?

అల్లూరి జిల్లా ఏజెన్సీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అన్నదమ్ముల మధ్య చిన్నగా మొదలైన గొడవ ప్రాణాలు తీసుకునేవరకు వెళ్లింది. తాను కోసిన పండును తిన్నదని తమ్ముడి ఆవును అన్న కొట్టగా తన అవును కొట్టడంపై ఆగ్రహించిన తమ్ముడు అన్నతో గొడవకు దిగాడు. పరస్పరం ఇద్దరు దాడిచేసుకొగా అన్న చేతిలో తమ్ముడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Andhra News: పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
Alluri District

Edited By: Anand T

Updated on: Jun 16, 2025 | 10:25 PM

చిన్నపాటి వివాదం అన్నదమ్ముల మధ్య బాణం దాడికి దారితీసింది. వాగ్వాదం జరిగి చివరకు ఒకరి ప్రాణం తీసేసింది. అల్లూరి జిల్లా ఏజెన్సీ లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామమైన రంగబయలు ప్రాంతంలో అక్కడక్కడ అమాయక పేద గిరిజనుల నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలోనే సీసా లైచోన్, సిసా కామేశ్వరరావు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటున్నారు. అయితే ఇటీవల అన్న సీసా లైచోన్ తోటలో పనస పండు కోసం చెట్టు ఎక్కాడు. పండును కోసి కింద వేసాడు. అదే సమయంలో చెట్టు సమీపంలో గడ్డి మేస్తూ ఉన్న తమ్ముడు కామేశ్వరరావుకు చెందిన అవు వెంటనే సీసా లైచోన్ కోసిన పనసపండును తినేసింది.

తాను ఎంతో కష్టపడి చెట్టు ఎక్కి కోసిన పనసపండు తిన్నది అనే కోపంతో ఆ ఆవుపై అన్న సీసా లచోన్‌ కత్తితో దాడి చేసి గాయపరిచాడు. దీంతో రక్తం కారుతూ వస్తున్న ఆవును చూసిన తమ్ముడు కామేశ్వరరావు. తన ఆవుపై దాడి చేసింది ఎవరు అనేదానిపై ఆరా తీశాడు. సీసా లచోన్‌ అవుపై దాడి చేయడం చూసిన స్థానికులు మీ అన్నయ్యే ఆవుపై దాడి చేశాడని తమ్ముడు కామేశ్వరరావుకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన కామేశ్వరరావు, అన్న లచోన్‌ దగ్గరకు వెళ్లి వాగ్వాదానికి దిగాడు. దీంతో అన్నదమ్ములు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గమనించిన గ్రామస్తులు సర్ది చెప్పి ఇద్దరిని సముదాయించారు.

అయితే మద్యం సేవించిన అన్న లైచోన్ అర్ధరాత్రి కామేశ్వరరావు ఇంటికి వెళ్లి మళ్లీ గొడవపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన లైచోన్.. బాణంతో తమ్ముడు కామేశ్వరరావు గుండెపై బలంగా పొడిచాడు. దీంతో తమ్ముడు కామేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న జిమాడుగుల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని అన్న సీసా లైచోన్ అరెస్ట్‌ చేసి పీఎస్‌కు తరలించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,,