Boat capsized in sileru reservoir: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీలేరు రిజర్వాయర్లో రెండు నాటు పడవలు బోల్తా పడి 8 మంది గల్లంతయ్యారు. ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఐదుగురు ఆచుకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఒకరి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద సంఘటన సీలేరు గుంటవాడ దగ్గర చోటుచేసుకుంది. బాధితులంతా ఒడిశా వెళ్లేందుకు నాటుపడవలో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన మరో ఐదుగురి కోసం స్థానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు మామిడిగూడ గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. రిజర్వాయర్లో మొత్తం ఐదు పడవల్లో ప్రయాణిస్తుండగా రెండు పడవలు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగనట్లు పేర్కొంటున్నారు. రిజర్వాయర్ వద్ద గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.
కాగా.. గాలింపు చర్యల్లో ఏడాది పసిబిడ్డ మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దిగ్భ్రాంతి వ్యక్తిచేశారు. సీలేరు జెన్కో అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి ప్రమాదం గురించి తెలుసుకున్నారు. వెంటనే.. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కోరారు. అధికారులు స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
Also Read: