కేజ్రీవాల్ జీ ! ఢిల్లీవాసులంటే ఎవరు’? చిదంబరం
ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను ఢిల్లీవాసులకే రిజర్వ్ చేశామంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న చేసిన ప్రకటనపై..

ఢిల్లీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలను ఢిల్లీవాసులకే రిజర్వ్ చేశామంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిన్న చేసిన ప్రకటనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత పి.చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విధమైన ప్రకటన చేసేముందు కేజ్రీవాల్ న్యాయ నిపుణుల సలహా ఏమైనా తీసుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ వాసులు అంటే ఎవరు ? నేను ఈ నగరంలో నివసిస్తున్నా.. ఇక్కడ పని చేస్తున్నా… అయితే ఢిల్లీ వాసినే అవుతానా అన్నారు. జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ పథకాల కింద తమ పేర్లు నమోదు చేయించుకున్న ఎవరైనా.. ఏ ఆసుపత్రిలోనైనా, ఇండియాలో ఎక్కడైనా చికిత్స పొందవచ్చునని తాను భావిస్తున్నానని చిదంబరం పేర్కొన్నారు. కాగా- ఐదుగురు డాక్టర్లతో కూడిన కమిటీ ఇఛ్చిన సలహా పైనే తానీ ప్రకటన చేసినట్టు కేజ్రీవాల్ నిన్న స్పష్టం చేసిన విషయం గమనార్హం.