కరోనా కష్టకాలంలో ప్రజల్ని ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఎంతోమంది నిరుపేదలు, దినసరి కూలీలు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అనేకం పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తున్నాయి. ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు తన సొంత ఖర్చులతో కరోనా బాధితులకు సాయం చేస్తున్నారు. వైరస్ బారిన పడి ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా కుంగిపోయిన వారికి సాయం చేస్తూ..దాతృత్వం చాటుకుంటున్నారు.
కరోనా రోగులకు అండగా ఉండేలా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కరోనా అనుమానితులై క్వారంటైన్కు వెళ్లొచ్చిన వారికి రూ. 3వేలు, పాజిటివ్ వచ్చి ఐసోలేషన్కు వెళ్లొస్తే రూ. 10వేల సాయం అందిస్తానని చెప్పారు. వైద్యం, పోషకాహారంతో పా టు కుటుంబ ఖర్చులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా ఈ సహాయం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెవిరెడ్డి స్పష్టం చెప్పారు.
ఇదిలా ఉంటే, ఏపీలో కోవిడ్ రెడ్ జోన్లు తగ్గాయి. గత వారం కేంద్ర ఆరోగ్య శాఖ 11 జిల్లాలను రెడ్ జోన్లుగా ప్రకటించగా.. తాజాగా ఐదు జిల్లాలను మాత్రమే వెల్లడించింది. మిగిలిన 8 జిల్లాల్లో ఏడు ఆరెంజ్ జోన్లో, ఒకటి గ్రీన్ జోన్లో ఉన్నాయి. తాజా వర్గీకరణ మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశ వ్యాప్తంగా 130 జిల్లాలను రెడ్ జోన్లో, 284 జిల్లాలు ఆరెంజ్ జోన్లో, 319 జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, రెడ్జోన్లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, నెల్లూరు ఉన్నాయి.