కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న పేదల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా సొమ్ము వేయకపోతే ప్రభుత్వం అతి దారుణ పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. జూమ్ మీడియా కాల్ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల భారీ ఆర్ధిక ప్యాకేజీపై పునరాలోచించా లని కోరుతున్నామన్నారు. ఈ ప్యాకేజీపై ఆయన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. ఇది అసలు ‘లోన్ ప్యాకేజీ’ (రుణ ప్యాకేజీ) అని అభివర్ణించారు. దీనివల్ల రైతులు, వ్యవసాయదారులు, పేదలకు తక్షణ సాయం లభించదన్నారు. ‘మన పేదలకు మనీ అత్యవసరం.. మోదీజీ ! డైరెక్ట్ ట్రాన్స్ ఫర్ పై మళ్ళీ ఆలోచించండి.. ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 200 రోజులకు పెంచండి’ అని రాహుల్ అభ్యర్థించారు. ఈ వలస కార్మికులు, శ్రామిక జీవులే మన భావి భారత భాగ్య ప్రదాతలు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తాము గత ఏడాది ప్రకటించిన ‘న్యాయ్’ పథకాన్ని ఆయన గుర్తు చేశారు. 72 వేల కోట్ల వార్షిక ఆదాయ సహాయానికి సంబంధించిన ఈ తరహా పథకాన్ని చేపట్టాలని సూచించారు.
ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీని కాంగ్రెస్ పార్టీ ‘జుమ్లా ప్యాకేజీ’ (మోసపూరిత ప్యాకేజీ) గా అభివర్ణించింది. ఈ పార్టీ ఆరోపణతో ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి కూడా ఏకీభవించారు.