హైదరాబాద్ నగరంపై కరోనా వైరస్ పంజా విసురు తోంది. వారం రోజుల క్రితం రాజధాని నగరంలో కరోనా ఉధృతి కాస్తా తగ్గుముఖం పట్టినట్టే అనిపించినా తిరిగి పుంజుకుంటోంది. నెలల పసికందులను కూడా కరోనా కాటేస్తోంది. లాక్డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తూ ప్రజలను కాపాడాల్సిన పోలీసులు కూడా కరోనా బారిన పడుతున్నారు. పిజ్జాబాయి, పోలీసు కానిస్టేబుల్స్, సెక్యూరిటీ గార్డు మొదలు చివరకు ప్రజల ప్రాణాలు కాపాడుతున్న వైద్యుకు కూడా కరోనా సోకిన కేసులు వెలుగు చూస్తుండడంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు.
కరోనా వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో నగరంలో లాక్డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. గుర్తింపు కార్డు లేనిదే రోడ్ల మీదకు ఎవ్వరినీ రానీయబోమని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, లాక్డౌన్ కారణంగా పలుచోట్ల కిరాణా దుకాణాలను కొన్ని గంటల పాటే అనుమతిస్తారని ప్రచారం జరుగుతోంది. ఉదయం 11 గంటల తర్వాత షాపులు మూసివేస్తారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ క్లారిటీ ఇచ్చారు. నిత్యావసరాల దుకాణాలు మూసివేయాలని ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదని స్పష్టంచేశారు. సమయానికంటే ముందే నగరంలో దుకాణాలు మూసేయబోమని.. నిత్యావసరాల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే సాయంత్రం వరకు షాపులకు అనుమతించామని చెప్పారు.