క‌రోనా యుద్దంః వ్యాక్సిన్ కు అడుగు దూరంలో హైదరాబాద్ జినోమ్ వ్యాలీ

|

May 13, 2020 | 11:35 AM

హైదరాబాద్‌ జినోమ్‌ క్లస్టర్‌ నుంచి భారత్‌ బయోటెక్‌, శాంతా బయోటెక్‌, బయోలాజికల్‌ ఇవాన్స్‌ వంటి కంపెనీలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో శాస్త్రీయ విజయానికి అడుగు దూరంలో నిలిచాయి.

క‌రోనా యుద్దంః వ్యాక్సిన్ కు అడుగు దూరంలో హైదరాబాద్ జినోమ్ వ్యాలీ
Follow us on

క‌రోనా రేసులో భార‌త్ కూడా దూసుకెళ్తోంది. 15 రోజుల క్రితం వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే దేశంలో కేసుల సంఖ్య, మ‌ర‌ణాల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉండేది. కాని ఇప్పుడు మ‌నం కూడా ప్ర‌పంచ దేశాల‌కు పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాం. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధిక ఎక్కువ కేసులు న‌మోదైన దేశాల జాబితాలో ఇండియాకు 12వ ప్లేస్ ద‌క్కింది. కానీ క‌రోనా పై పోరులోనూ భార‌త్ గ‌ట్టి పోటీనే ఇస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ వ్యాక్సిన్ త‌యారీలో ముందంజ‌లో ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ ఆవిష్కరణ కోసం శాస్త్రవేత్తలు అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. భార‌త్‌లోనూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పరిశోధన, అభివృద్ధి(ఆర్‌ అండ్‌ డీ) విషయంలో హైదరాబాద్‌ నగరంలోని జినోమ్ వ్యాలీ ముందంజ‌లో నిలిచింది. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పరీక్షల్లో వేగంగా వృద్ధి కనిపిస్తోంది. హైదరాబాద్‌ జినోమ్‌ క్లస్టర్‌ నుంచి భారత్‌ బయోటెక్‌, శాంతా బయోటెక్‌, బయోలాజికల్‌ ఇవాన్స్‌ వంటి కంపెనీలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో శాస్త్రీయ విజయానికి అడుగు దూరంలో నిలిచాయి. ఒకవేళ ఈ కంపెనీలు తొలుత వ్యాక్సిన్‌ను ఆవిష్కరించలేపోయినప్పటికీ ఈ కంపెనీలకు ఎనలేని ప్రాముఖ్యత ఉంది. భారీగా ఉత్పత్తి సామర్థ్యాలు ఉండడమే దీనికి కారణం. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌కు తగ్గట్టుగా వ్యాక్సిన్లు అందించే సత్తా ఇక్కడి కంపెనీల సొంతం.

ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలు, ఇతర కార్యకలాపాలు మొదలైన తర్వాత కోట్లాది కోవిడ్‌ వ్యాక్సిన్లు అవసరమవుతాయి. కాబట్టి భారీ స్థాయిలో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఏర్పడితే మేడ్‌ ఇన్ జినోమ్‌ వ్యాలీ వ్యాక్సిన్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించే అవకాశాలున్నాయనే అంచనాలున్నాయి. ఈ క్ర‌మంలోనే కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి పురోగతిపై ఇటివలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జియోన్‌ వ్యాలీ ప్రతినిధులను కలిశారు. ఈ కంపెనీ పరిశోధన, అభివృద్ధి సామర్థ్యాలపై ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.